ఏపీ-తెలంగాణ మధ్య అంతర్యుద్ధం?

దేశ మంతటా ప్రస్తుతం అన్‌లాక్‌ 4.0 నడుస్తోంది. ఇటీవల కేంద్రం రిలీజ్‌ చేసిన గైడ్‌లైన్స్‌లో అంతర్రాష్ట్ర రవాణాపై ఎలాంటి ఆంక్షలు పెట్టొద్దంటూ సూచించింది. ఆంక్షలు విధిస్తే నిబంధనలు ఉల్లంఘించినట్లే అవుతుందని చెప్పింది. దీంతో తెలంగాణ–ఆంధ్ర మధ్య ఆంక్షలు తొలిగి ఆర్టీసీ బస్సులు ప్రారంభం అవుతాయని అందరూ భావించారు. అయితే.. తెలంగాణలో రవాణా వ్యవస్థపై ఎలాంటి ఆంక్షలైతే కొనసాగడం లేదు. కానీ.. ఇంతవరకైతే సర్వీసులు ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో అసలు సమస్య ఎక్కడ ఉందనేది సర్వత్రా చర్చ […]

Written By: NARESH, Updated On : September 4, 2020 12:31 pm

Road transport ap telangana

Follow us on

దేశ మంతటా ప్రస్తుతం అన్‌లాక్‌ 4.0 నడుస్తోంది. ఇటీవల కేంద్రం రిలీజ్‌ చేసిన గైడ్‌లైన్స్‌లో అంతర్రాష్ట్ర రవాణాపై ఎలాంటి ఆంక్షలు పెట్టొద్దంటూ సూచించింది. ఆంక్షలు విధిస్తే నిబంధనలు ఉల్లంఘించినట్లే అవుతుందని చెప్పింది. దీంతో తెలంగాణ–ఆంధ్ర మధ్య ఆంక్షలు తొలిగి ఆర్టీసీ బస్సులు ప్రారంభం అవుతాయని అందరూ భావించారు. అయితే.. తెలంగాణలో రవాణా వ్యవస్థపై ఎలాంటి ఆంక్షలైతే కొనసాగడం లేదు. కానీ.. ఇంతవరకైతే సర్వీసులు ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో అసలు సమస్య ఎక్కడ ఉందనేది సర్వత్రా చర్చ సాగుతోంది. అయితే ఇరు రాష్ట్రాల మధ్య ఎక్కువ సర్వీసులు తమవే అంటే తమవే ఉండాలంటున్న ఇరురాష్ట్రాల గొడవతోనే ఇలా జరుగుతున్నట్లు తెలుస్తోంది.

వివిధ రాష్ట్రాల మధ్య అన్ని ఆంక్షలు ఎత్తివేసి అన్నిరకాల సర్వీసులు తిరుగుతూనే ఉన్నాయి. కానీ.. మన తెలుగు రాష్ట్రాల మధ్య ఇంకా కొలిక్కి రావడం లేదు. మొన్నటివరకు తెలంగాణ నుంచి వచ్చే వాహనాలను సైతం చెక్‌ పోస్టుల ద్వారా అడ్డుకున్న ఏపీ ప్రభుత్వం.. తాజాగా కేంద్రం ఆగ్రహంతో వాటిని ఎత్తేసింది. ఆర్టీసీ బస్సుల పునఃప్రారంభంపై తెలంగాణ ఆర్టీసీ అధికారులతో రెండు దఫాలుగా చర్చలు చేపట్టిన అవి ఫలితం ఇవ్వలేదు. దీంతో తదుపరి చర్యలపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది.

లాక్‌ డౌన్‌ కారణంగా మార్చి 22న నిలిచిపోయిన అంతర్‌ రాష్ట్ర రవాణా ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ఏపీ బస్సులను సైతం తెలంగాణకు రానివ్వడం లేదు. అయితే బస్సుల రాకపోకలు పునఃప్రారంభం కాకపోవడానికి ప్రధానంగా కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య ఎవరు ఎన్ని బస్సులు నడపాలి, ఎన్ని కిలోమీటర్లు నడపాలి అన్న దానిపై ఒప్పందం కుదరకపోవడమేనని తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎలా అయితే బస్సులు నడుస్తున్నాయో లాక్ డౌన్ ముందు వరకు అలానే నడిచాయి. అయితే, ఈ విషయంలో తెలంగాణ సర్కార్‌ అభ్యంతరం చెబుతోంది. తెలంగాణ బస్సులు ఏపీకి తక్కువగా సంఖ్యలో ఉన్నాయని, అదే ఏపీ నుంచి తెలంగాణకి ఎక్కువ సంఖ్యలో ఉన్నాయని అభ్యతరం తెలిపింది. తెలంగాణ బస్సు సర్వీసులు పెంచుకునేందుకు ఒప్పుకోవాలని ఏపీని కోరుతోంది. దీనికి ఏపీ ఒప్పకోకపోవడంతో ప్రతిష్టంభన కొనసాగుతోంది.

వాస్తవానికి కరోనాకు ముందు ఇరు రాష్టాల మధ్య ఎన్ని బస్సులు నడిచాయో ఇప్పుడూ అంతే సంఖ్యలో వాటిని నడపాలని ఏపీ కోరుతుండగా.. టీఎస్‌ఆర్టీసీ అందుకు అంగీకరించడం లేదు. కరోనా కారణంగా ఇరు రాష్ట్రాలూ నష్టపోయాయని, ఆ నష్టాలను పూడ్చుకోవాలంటే తమకు అత్యధికంగా ఆదాయం తెచ్చిపెట్టే హైదరాబాద్‌ నుంచి ఏపీ సర్వీసులను పెంచుకుంటామని తెలంగాణ ప్రతిపాదిస్తోంది. దీనికి అంగీకరిస్తే ఇప్పటివరకూ రెండు వైపులా అత్యధికంగా బస్సులు తిప్పుతున్న ఏపీఎస్ ఆర్టీసీకి ఆ మేరకు నష్టాలు తప్పవు. దీంతో ఏపీఎస్‌ ఆర్టీసీ దీనికి ససేమిరా అంటోంది. ఈ విషయంలో టీఎస్‌ఆర్టీసీ కూడా అదే పట్టు కొనసాగిస్తుండంతో మరికొన్ని రోజుల పాటు ప్రతిష్టంభన కొనసాగే అవకాశముంది. అయితే తెలంగాణ ప్రభుత్వం కోరిన కిలోమీటర్ల దూరంలో సగం తగ్గించుకుంటామని ఏపీ అధికారులు లేఖ రాసినా తెలంగాణ ఆర్టీసీ అధికారులు మాత్రం స్పందించడం లేదు.