సమయం దొరికినప్పుడల్లా కొంత మంది సీఎంలు కేంద్రాన్ని దున్నేస్తాం.. కేంద్రాన్ని నిలదీస్తాం.. కేంద్రంలో బీజేపీని దింపేస్తాం.. అంటూ మాటలు చెబుతుంటారు. కేంద్రం మెడలు వంచి నిధులు తెచ్చుకుంటాం అంటూ పెద్ద పెద్ద ఉపన్యాసాలే ఇస్తుంటారు. అటు తెలంగాణ సీఎం కేసీఆర్ గానీ.. తమిళనాడు స్టాలిన్ కానీ.. మరోవైపు కర్ణాటక నేతలను చూసినా ఇవే డైలాగులు వినిపిస్తుంటాయి.
Also Read: హిందూపురంలోనూ అధికార పార్టీదే హవా : బాలయ్యా.. ఇది ఏందయా..!
కానీ.. ఏపీ నేతలను చూస్తుంటే మాత్రం కేంద్రానికి లొంగిపోయినట్లుగా అర్థం చేసుకోక తప్పదు. పక్క రాష్ట్రం నేతలతో పోలిస్తే చంద్రబాబు జగన్ పవన్ సత్తా లేని నేతలు అంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. సొంత రాష్ట్రానికి అన్యాయం జరిగినా.. కేంద్రం ఏదైనా నిర్ణయం తీసుకున్నా.. పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతిఘటన ఏపీ నుంచి రాకపోవడమే ఇప్పుడు అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. తమిళనాడులో జల్లికట్టుపై ఇతర కేంద్రం తీసుకున్న నిర్ణయాలపై ప్రతిపక్ష డీఎంకే అధినేత స్టాలిన్ సహా కమల్ హాసన్ ఇతర నేతలు పెద్ద ఉద్యమమే చేశారు.
మరోవైపు.. కర్ణాటకలోనూ మహారాష్ట్ర తమ ప్రాంతాన్ని కొట్టేస్తోందంటూ వ్యతిరేకత చూపారు. కేంద్రంలోని బీజేపీతోనూ అక్కడి ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు డీకే లాంటివారు ఢీకొని జైలుపాలయ్యారు. ఇక తెలంగాణలో కేసీఆర్ బీజేపీని టైం చూసి కొడుతుంటారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీతో సఖ్యతతో వెళ్లి మరీ కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ప్రసాద్ లాంటి దిగ్గజ నేతలను ఓడించారు. వ్యవసాయ చట్టాలపై ఏకంగా మంత్రులతో రోడ్లపై నిరసన చేయించారు. సమయం సందర్భం బట్టి కేసీఆర్ సైతం కాస్త గట్టిగానే ప్రవర్తిస్తారు. కేంద్రంలోని పెద్దల పిలుపుతో చల్లబడుతుంటారు.
Also Read: పులివెందులలో వైసీపీ క్లీన్స్వీప్
ఆ మాత్రం ప్రతిఘటన కూడా ఏపీ నుంచి వ్యక్తం కావడం లేదన్న ఆవేదన ఏపీ ప్రజల్లో కనిపిస్తోంది. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను ఆపు చేయిస్తానని ఢిల్లీ వెళ్లిన జనసేనాని పవన్ అక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ సైలెంట్ అయిపోయారు. ఏపీ సీఎం జగన్ లేఖ రాసి అంతటితోనే ఆగిపోయారు. ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన చంద్రబాబు కూడా అస్సలు పట్టించుకోవడంలేదు. దీంతో విశాఖ వాసులు ఎంత రోడ్డెక్కి ఆందోళన చేసినా ఏపీ పార్టీలు మాత్రం చీమకుట్టినట్లైనా స్పందించడంలేదు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్