Chandrababu: ఒకే విమానంలో చంద్రబాబు, రోజా

చంద్రబాబు తిరుపతి నుంచి విజయవాడ వస్తున్న తరుణంలో ఓ ఘటన ఆసక్తి రేపింది. చంద్రబాబు ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలోనే.. ఏపీ మంత్రి రోజా వచ్చారు.

Written By: Dharma, Updated On : December 2, 2023 10:29 am

Chandrababu

Follow us on

Chandrababu: చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలను సందర్శిస్తున్న సంగతి తెలిసిందే. అవినీతి కేసుల్లో అరెస్టయిన చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో 53 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తొలుత ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. తరువాత రెగ్యులర్ బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాజకీయ కార్యకలాపాలకు సైతం అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆలయాలను కుటుంబ సమేతంగా దర్శించుకుంటున్నారు.ఇప్పటికే తిరుమలలోని శ్రీవారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి విజయవాడ వచ్చారు.

చంద్రబాబు తిరుపతి నుంచి విజయవాడ వస్తున్న తరుణంలో ఓ ఘటన ఆసక్తి రేపింది. చంద్రబాబు ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలోనే.. ఏపీ మంత్రి రోజా వచ్చారు. చంద్రబాబు రాక నేపథ్యంలో విజయవాడ ఎయిర్పోర్ట్ లో టిడిపి శ్రేణుల సందడి వాతావరణం నెలకొంది. అటు చంద్రబాబు, ఇటు రోజా రాకతో పోలీసులు హైరానాకు గురయ్యారు. ప్రత్యేక సెరెమోనిఎల్ లాంజ్ ద్వారా మంత్రి రోజాను పోలీసులు బయటకు పంపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. రోడ్డు మార్గం గుండా మంత్రి రోజా విజయవాడ బయలుదేరి వెళ్లడంతో ఊపిరి పీల్చుకున్నారు.

విశాఖ విమానాశ్రయంలో మంత్రి రోజా పర్యటనలో జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిందే. పవన్ విశాఖపట్నం పర్యటనకు వస్తుండగా ఎయిర్ పోర్ట్ లో భారీగా జనసేన శ్రేణులు అక్కడకు చేరుకున్నాయి. అధినేత రాక కోసం ఎదురుచూస్తున్నాయి. అదే సమయంలో ఉత్తరాంధ్ర రాజధానికి మద్దతుగా వైసీపీ భారీ కార్యక్రమాన్ని చేపట్టింది. మంత్రులు హాజరయ్యారు. తిరుగు ప్రయాణంలో భాగంగా ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ఆ సమయంలో మంత్రి రోజా చేయి వేలు చూపుతూ జన సైనికులకు హెచ్చరికలు పంపినట్లు ప్రచారం జరిగింది. దీంతో జనసేన కార్యకర్తలు తమపై దాడి చేశారని మంత్రి రోజా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో ఆ ఘటన వివాదాస్పదమైంది. మరోసారి ఆ పరిస్థితి రాకుండా విజయవాడలో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు.