Chandrababu- Pawan Kalyan : ఎన్డీఏ లో( National democratic Alliance ) కీలక భాగస్వామ్యంగా ఉన్నారు చంద్రబాబుతో పాటు పవన్. బిజెపికి బలమైన మద్దతు దారులుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఈ ఇద్దరు నేతలు కొత్త శత్రువులను తెచ్చుకుంటున్నారన్న విమర్శ ఉంది. ఎన్డీఏ పక్షం కావచ్చు.. కానీ బిజెపి వ్యతిరేక పార్టీలను సైతం వీరు ప్రత్యర్థులుగా చూస్తున్నారు. వారికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. మున్ముందు ఇది ఇబ్బందులు తెచ్చి పెట్టవచ్చు. వరుసగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో బిజెపికి మద్దతుగా ఇద్దరు నేతలు ప్రచారం చేశారు. తెలుగు ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో బిజెపితో పాటు కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేశారు. ఈ క్రమంలో చాలా పార్టీలకు ఈ ఇద్దరు నేతలు వ్యతిరేకులుగా మారిపోయారు. మహారాష్ట్రలో పవన్ ప్రచారం చేశారు. ఢిల్లీలో సీఎం చంద్రబాబు ప్రచారం చేపట్టారు. ఈ రెండు చోట్ల బీజేపీకి మద్దతుగా ప్రచారం చేసిన వీరు ఇతర పార్టీలకు వ్యతిరేకులుగా మారిపోయారు.
* చంద్రబాబులో మార్పు చంద్రబాబు( Chandrababu) బిజెపికి దగ్గరయ్యారు. కానీ ఇతర పార్టీలతో స్నేహంగానే ఉండేవారు. ఏపీలో రాజకీయాల దృష్ట్యా చంద్రబాబు అలా వ్యవహరించడం తప్పదు. ఇదే విషయాన్ని గుర్తించిన ఇతర పార్టీ నేతలు చంద్రబాబు విషయంలో ఉదారంగా ఉండేవారు. కానీ ఇప్పుడు చంద్రబాబు ఓపెన్ అవుతున్నారు. బిజెపితో స్నేహాన్ని పటిష్టం చేసుకునేందుకు ఆ పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ఇదే జాతీయస్థాయిలో ఇతర పార్టీలకు వ్యతిరేకంగా మారిపోతున్నారు. మొన్నటికి మొన్న ఢిల్లీలో ప్రచారం చేశారు. అరవింద్ కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా మాట్లాడారు. కానీ అదే అరవింద్ కేజ్రీవాల్ 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ప్రచారం చేశారు. ఇప్పుడు కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా చంద్రబాబు వెళ్లడంతో కొత్త శత్రువు తయారయ్యారు.
* మమతా బెనర్జీ పై పవన్ విమర్శలు..
మొన్నటికి మొన్న మహారాష్ట్ర ఎన్నికల్లో బిజెపి కూటమికి మద్దతుగా ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్( Pawan Kalyan). ఈ క్రమంలో అక్కడ శివసేన తో పాటు నేషనల్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం అయ్యారు. తాజాగా కుంభమేళాలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పై సంచలన ఆరోపణలు చేశారు. కుంభమేళాలో తొక్కిసలాట ఘటనపై మమతా బెనర్జీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దానిని తప్పుపడుతూ పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కోట్లాదిమంది భక్తులు హాజరవుతున్న దృష్ట్యా చిన్న చిన్న ఘటనలు జరగడం సాధారణమని.. దానిపై రాజకీయ విమర్శలు చేయడం ఏమిటని మమతా బెనర్జీ తీరును తప్పుపట్టారు పవన్ కళ్యాణ్.
* ఆ నేతలకు దూరమవుతున్న చంద్రబాబు
అయితే బిజెపి( Bhartiya Janata Party ) మూలంగా చంద్రబాబు జాతీయస్థాయిలో మిగతా పార్టీ నేతలకు దూరమయ్యారు. గతంలో ఆయన మమతా బెనర్జీ, స్టాలిన్, శరద్ పవర్ వంటి నేతలతో పనిచేశారు. ఏపీ రాజకీయ అవసరాల మేరకు చంద్రబాబు తన వైఖరి మార్చుకున్న… ఆయనను మాత్రం తమ స్నేహితుడిగానే చూసేవారు జాతీయస్థాయి నేతలు. కానీ ఇప్పుడు బీజేపీ స్నేహాన్ని పటిష్టం చేసుకునేందుకు చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగడం మాత్రం.. వారంతా వ్యతిరేకిస్తున్నారు. అదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం బిజెపి అజెండాను అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు జాతీయస్థాయిలో వినిపిస్తున్నాయి. మున్ముందు ఈ పరిణామాలు ఆ ఇద్దరు నేతలకు ఇబ్బంది తెచ్చి పెడతాయని కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.