లాక్ డౌన్ పొడిగింపుపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ పొడిగిస్తారన్న ప్రచారంలో వాస్తవం లేదని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా తీవ్రంగా ఖండించారు. దీనిపై మీడియా, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు కేవలం వందంతులని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు పుకార్లను నమ్మొద్దని రాజీవ్ గౌబా విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న విషయం తెలిసిందే. ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటిస్తున్నారు.
కరోనా వైరస్ దేశంలో రోజురోజుకీ విస్తరిస్తున్న నేపథ్యంలో దాన్ని కట్టడి చేయడం కోసం ప్రధాని నరేంద్ర మోదీ గత మంగళవారం 21రోజుల లాక్ డౌన్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. నాటి నుంచి దేశవ్యాప్తంగా జనసంచారంపై కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. అయినా కొత్తగా వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో లాక్ డౌన్ ని మరికొన్ని రోజుల పాటు కొనసాగించే అవకాశం ఉందని వదంతులు వ్యాప్తించాయి. తాజాగా వీటిని కేంద్రం కొట్టివేసింది.
దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1071చేరింది. 900 మందిలో ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. 96 మంది ఈ వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 29 మంది మృతి చెందారు.