ఏపీ సీఎం జగన్ కు గట్టి షాక్ తగిలింది. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు వేసిన పిటీషన్ ను హైదరాబాద్ సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ పరిణామం సీఎం జగన్ ను ఇరుకునపెట్టినట్టైంది.
సీఎం హోదాలో ఉండి కేంద్రంతో సయోధ్యతో ముందుకెళుతున్నారు జగన్.. ఆయనపై నమోదైన కేసుల విచారణ కాస్త నెమ్మదిగా సాగుతోంది. ఈ క్రమంలోనే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు ఏకంగా జగన్ ను టార్గెట్ చేసి కోర్టుకెక్కాడు. జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటీషన్ వేశాడు. ఈనెల 22న దీనిపై విచారణ జరుపుతామని కోర్టు తెలిపింది. రఘురామ పిటీషన్ ను కోర్టు విచారణకు స్వీకరించడం రాజకీయవర్గాల్లో పెను సంచలనమైంది.
అక్రమాస్తుల కేసులో సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని ఈనెల మొదటి వారంలోనే ఎంపీ రఘురామకృష్ణం రాజు బెయిల్ పిటీషన్ దాఖలు చేయగా.. సరిగా లేదని మళ్లీ వేయాలని కోర్టు తెలిపింది. తాజాగా ఆయన నీట్ గా దాఖలు చేశారు.. 11 చార్జీషీట్లలో ఏ1గా ఉన్న.. విచారణకు రాకుండా తప్పించుకుంటున్న జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటీషన్ లో రఘురామ కోరారు. జగన్ నిర్ధోషిగా బయటపడాలనేది నా ఉద్దేశమన్నారు. పార్టీ కోసం.. ప్రజాస్వామ్యం కోసం ఈ పిటీషన్ వేసినట్టు తెలిపారు.
ఒక సీఎం స్థానంలో సాక్షులను ప్రభావితం చేసే అవకాశం జగన్ కు ఉందని.. ఈ కేసుల్లో నిందితులైన నలుగురిని రాజ్యసభ ఎంపీలుగా జగన్ చేశారని.. అధికారులకు ప్రమోషన్లు ఇస్తున్నారని రఘురామ పిటీషన్ లో పేర్కొన్నారు. వీరంతా సాక్ష్యులను ప్రభావతం చేస్తారని రఘురామ తెలిపారు.
అయితే ఈ పిటీషన్ ను సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించడం ఏపీ రాజకీయవర్గాలను షేక్ చేసింది. ఇప్పటికే తిరుపతి ఉప ఎన్నికల్లో చంద్రబాబు, లోకేష్ లు ముందుగానే ‘జగన్ జైలుకు వెళ్లబోతున్నారని..’ ఆరోపించడం ఈ అనుమానాలకు బలం చేకూరింది. అంటే రఘురామ వెనుక టీడీపీ హస్తం ఉందా? వారే వేయించారా? అన్న అనుమానాలను వైసీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ పిటీషన్ విచారణకు వస్తుండడంతో రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. జగన్ బెయిల్ రద్దు చేస్తే మాత్రం ఆయన మళ్లీ జైలుకు వెళ్లడం ఖాయమని.. ఏపీ సీఎం సీటులో ఎవరు కూర్చుంటారు? అసలు ఇదంతా జరుగుతుందా? లేదా? కోర్టు ఏం నిర్ణయిస్తుందనేది ఉత్కంఠగా మారింది. మొత్తానికి వైసీపీ నుంచి గెలిచి వైసీపీ అధినేతకే విలన్ గా మారిన రఘురామకృష్ణం రాజు ఇప్పుడు సీఎం జగన్ కు ముచ్చెమటలు పట్టిస్తున్నారు.