Captain Amarinder Singh: కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలంటారు. అలాగే అమరీందర్ సింగ్ రాజీనామాకు కూడా పంజాబ్ లో భారీ కుట్రలే చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. పంజాబ్ కాంగ్రెస్ లో సంక్షోభం ఏర్పడింది. ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామాతో పార్టీ భవితవ్యం డోలాయమానంలో పడింది. ఇన్నాళ్లు పార్టీకి బలంగా ఉన్న ఆయన దూరం కావడంతో పార్టీ కష్టాలు ఎదుర్కోవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పీసీసీ అధ్యక్షుడు నవజ్యోతి సింగ్ సిద్దూకు సీఎం అమరీందర్ కు పొసగకపోవడంతో రాజీనామా వరకు వెళ్లింది వ్యవహారం. దీంతో పార్టీ అధిష్టానం సైతం పట్టించుకోకపోవడం విడ్డూరంగా కనిపిస్తోంది. అసలే అధికారం దూరమైన కాంగ్రెస్ పార్టీ ఇలాంటి చౌకబారు రాజకీయాలతో మరింత దిగజారుతోందని తెలుస్తోంది.
ముఖ్యమంత్రి అమరీందర్ పై కావాలనే బురదజల్లే ఉద్దేశంతోనే ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు ఉపసంహరించుకునే విధంగా ఆలోచనలు చేసినట్లు సమాచారం. మెజార్టీ ఎమ్మెల్యేలు అమరీందర్ విధానాలకు విసిగిపోయి ఆయన నాయకత్వాన్ని వద్దనుకున్నట్లు చెబుతున్నా భవిష్యత్ లో పార్టీ బలోపేతం కావడం అంత సులువు కాదనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మనుగడ అనుమానాస్పదమే అని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
పార్టీ అధిష్టానం కూడా అమరీందర్ నాయకత్వాన్ని బలపరచినా ఎమ్మెల్యేల ఒత్తిడికి తలొగ్గి ఆయన రాజీనామాకు దారి తీయడం సముచితం కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సీఎల్పీలో ఎదురయ్యే పరిస్థితిని ఊహించి సీఎం తన పదవి వదులుకునేందకు సిద్ధపడ్డారని తెలుస్తోంది. కానీ కాంగ్రెస పార్టీ అధిష్టానం సైతం నిమ్మకు నీరెత్తనట్లుగా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
పార్టీ నాయకురాలు సోనియా గాంధీ సూచనతోనే అమరీందర్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. మొదటి నుంచి పీసీసీ అధ్యక్షుడు నవజ్యోతి సింగ్ సిద్దూకు అమరీందర్ కు పొసగలేదు. దీంతో కాంగ్రెస్ నేతలు సమన్వయంతో పనిచేయాలని సూచించినా పరిస్థితిలో మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో అమరీందర్ రాజీనామా చేయాల్సిందిగా కోరడంతో ఆయన కూడా సరే అని తన పదవి త్యాగం చేశారు. దీంతో కాంగ్రెస్ కు ముందుముందు ముప్పు ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి.