Budget 2024: ‘పీఎం కిసాన్‌’ పెంపు.. బడ్జెట్‌లో గుడ్ న్యూస్?

ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద కేంద్ర ప్రస్తుతం 5 ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు ఏటా రూ.6 వేల పెట్టుబడి సాయం అందిస్తోంది. దాదాపు ఐదేళ్లుగా ఈసాయం అందుతోంది.

Written By: Raj Shekar, Updated On : January 31, 2024 11:21 am
Follow us on

Budget 2024: లోక్‌సభ ఎన్నికల ముందు కేంద్రం పార్లమెంట్‌లో ఫిబ్రవరి 1న ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టబోతున్నారు. ఇందులో రైతులకు వరాలు కురిపిస్తారని ప్రచారం జరుగుతోంది. ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకంలో రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయాన్ని పెంచనున్నట్లు తెలుస్తోంది. మధ్యంతర బడ్జెట్‌ కావడంతో ఇందులో పేద, మధ్యతరగతి ప్రజలకు ఎక్కువ ప్రయోజనం చేకూర్చే అవకాశం కనిపిస్తోంది. ఆర్థిక నిపుణులు కూడా ఈమేరకు అంచనా వేస్తున్నారు.

కిసాన్‌ సాయం రూ.9 వేలకు పెంపు..
ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద కేంద్ర ప్రస్తుతం 5 ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు ఏటా రూ.6 వేల పెట్టుబడి సాయం అందిస్తోంది. దాదాపు ఐదేళ్లుగా ఈసాయం అందుతోంది. తాజాగా ఈ సాయం పరిమితిని పెంచాలని కేంద్రం భావిస్తోంది. 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రైతులకు లబ్ధి చేకూర్చనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రైతులకు పెట్టుబడి సాయాన్ని ఇక నుంచి రూ.9 వేలు ఇస్తారని ప్రచారం జరుగుతోంది.

మూడు విడతల్లో..
ప్రస్తుతం కిసాన్‌ నిధి సహాయాన్ని కేంద్రం మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. దీనిని రూ.9 వేలకు పెంచడం ద్వారా.. అదే మూడు విడతల్లో ఇక నుంచి నాలుగు నెలలకు ఒకసారి రూ.3 వేల చొప్పున లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనుంది.

పీఎం ఆవాస్‌ యోజనలో మార్పు..
అదే విధంగా పేదలకు సంబంధించిన మరో సామాజిక పథకం పీఎం ఆవాస్‌ యోజనలో కూడా భారీగా మార్పులు చేస్తారని తెలుస్తోంది. మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా మార్పులను ఈ బడ్జెట్‌లో ప్రతిపాదించే అవకాశం ఉంది. గత బడ్జెట్‌లో పీఎం ఆవాస్‌ యోజనకు రూ.60 వేల కోటుల కేటాయిచింది. ఈ కేటాయింపులను తాజాగా 50 శాతం అంటే మరో రూ.30 వేల కోట్లు పెంచనున్నట్లు తెలుస్తోంది. మధ్యతర బడ్జెట్‌లో దీనికి రూ.90 వేల కోట్లు కేటాయించే అవకాశం ఉంది.

ఎన్నికల బడ్జెట్‌..
మరో రెండు నెలల్లో పార్లమెంట్‌ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మధ్యంతర బడ్జెట్‌ పూర్తిగా రైతులు, మధ్య తరగతి ప్రజలు ఆకట్టుకునేలా ఉంటుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. సంక్షేమంతోపాటు అన్ని రంగాల్లో ప్రైవేటు పెట్టుబడులు పెంచేలా ఈ బడ్జెట్‌లో ప్రకటన చేసే అవకాశం కూడా ఉంది.