MLA Rajaiah : మీకు గుర్తుందా? స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య నన్ను లైంగికంగా వేధిస్తున్నాడని సర్పంచ్ నవ్య ఆరోపించింది. పంచాయతీ బిల్లుల కోసం తనను ఇబ్బందిపెడుతున్నాడని వాపోయింది. ఆ తర్వాత బీఆర్ఎస్ పెద్దలు రంగంలోకి దిగారు. సెటిల్ చేసుకోమని సూచించారు. వారు చెప్పినట్టే రాజయ్య నడుచుకున్నారు. తర్వాత అనేక పరిణామాలు జరిగాయి. అన్ని తనకు అనుకూలంగానే జరుగుతున్నాయి రాజయ్య అనుకున్నాడు. సీన్ కట్ చేస్తే కడియం శ్రీహరి రంగంలోకి వచ్చాడు. రాజయ్య నోటికాడి టికెట్ లాగేసుకు పోయాడు.
అప్పట్లో తన ఉదంతం వెలుగులోకి వచ్చినప్పుడు రాజయ్య సర్పంచ్ నవ్య మీద ఆరోపణలు చేశాడు. ఆమె భర్తను కూడా తన వైపు లాగేసుకున్నాడు. ఆయన అనుచరులు నవ్యను గేలి చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆమెపై రకరకాల మీమ్స్ రూపొందించి ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెట్టారు. మొదట్లో హుందాతనాన్ని ప్రదర్శించిన నవ్య.. తర్వాత సహనం కోల్పోయింది. తను కూడా ‘మహానటి’ అనే బిరుదును పొందాల్సి వచ్చింది. అంతే కాదు భర్త నుంచి ఛీత్కారాలు ఎదర్కొవాల్సి వచ్చింది. ఇక అధికార బీఆర్ఎస్ నేతల మాటలయితే చెప్పనలవి కాదు. చివరికి మాట ఇచ్చిన ఎమ్మెల్యే కూడా దానిని విస్మరించాడు. దీంతో ఆమె రెంటికి చెడ్డ రేవడి అయింది.
అటు అధిష్ఠానం నుంచి భరోసా లభించలేదు. స్థానిక ఎమ్మెల్యే నుంచి వేధింపులు ఆగ లేదు. దీంతో నవ్య నైరాశ్యంలో కూరుకుపోయింది. ఈక్రమంలోనే ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కదలికలు స్టేషన్ ఘన్పూర్లో మళ్లీ మొదలయ్యాయి. దీంతో రాజయ్య వర్గంలో అలజడి ప్రారంభమైంది. రాజయ్య పాత తప్పులకు తోడు నవ్య వ్యవహార పంటి కింద రాయి లాగా మారడంతో అతణ్ణి వదలించుకోవానే నిర్ణయానికి అధిష్ఠానం వచ్చింది. ఫ్లాష్ సర్వేలోనూ రాజయ్యకు వ్యతిరేకంగా ఫలితాలు రావడంతో బీఆర్ఎస్ ఇక ఏ దశలోనూ ఉపేక్షించకూడదనే అనుకుంది. రాజయ్యకు కేసీఆర్ ఇన్ డైరెక్ట్గా సంకేతాలు ఇవ్వడంతో ఆయన పని చేయడం ప్రారంభించారు. కడియం దిష్టిబొమ్మల దహనాలు, నిరసనల వంటి కార్యక్రమాలు రాజయ్య చేపట్టినా అవి గాలికి కొట్టుకుపోయిన పేలపిండి అయ్యాయి. సీన్ కట్ చేస్తే శ్రీహరికి టికెట్ దక్కింది. నవ్య పగ చల్లారింది. పాపమ్ రాజయ్యే కన్నీటి పర్యంతమవుతున్నాడు.