Harikrishna
Harikrishna : తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, కరీనంగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ(MLC) నియోజకవర్గ ఎన్నికలు ఫిబ్రవరి 27న జరుగనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఈమేరకు ఈసీ ఏర్పాట్లు చేసింది. మరోవైపు బరిలో చాలా మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ ప్రధాన పోటీ బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి వూట్కూరి నరేందర్రెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ(Prasanna Harikrishna) మధ్యనే ఉంది. ఈ త్రిముఖ పోరులో విజయం ఎవరిని వరిస్తుందన్నది మార్చి 3న తేలనుంది. ఇక తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో పోటీ చయడం లేదు. ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ను ఓడించాలని మాత్రం ప్రచారం చేస్తున్నారు. ఎవరికి ఓటు వేయాలో చెప్పడం లేదు. దీంతో బీఆర్ఎస్ రహస్యంగా బీజేపీకి మద్దతు ఇస్తుందని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. మరోవైపు బీజేపీ వాటిని తిప్ప కొడుతోంది. కాంగ్రెస్–బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం ఉందని బీజేపీ నాయకులు పేర్కొంటున్నారు. కానీ, బీఆర్ఎస్(BRS)మద్దతు బీజేపీ, కాంగ్రెస్కు లేదని.. ఆ పార్టీ బీఎస్పీ అభ్యర్థి అయిన ప్రసన్న హరికృష్ణకు పరోక్షంగా మద్దతు తెలుపుతోందని సమాచారం. ఇందుకోసం పార్టీ క్షేత్రస్థాయిలో కష్టపడుతున్నట్లు గులాబీ నేతల్లో ప్రచారం జరుగుతోంది. నాలుగు ఉమ్మడి జిల్లాలోని బీఆర్ఎస్ నేతలు కేడర్తో ప్రసన్న హరికృష్ణకు మద్దతుగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. సిట్టింగ్, మాజీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలోని ఓటర్లతో మంతనాలు జరిపి ప్రసన్న హరికృష్ణకు మ ద్దతు ఇవ్వాలని సూచిస్తున్నట్లు సమాచారం.
ఓటర్లను కలుస్తున్న గులాబీ టీం
2023 అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు ఉమ్మడి జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీచేసిన 18 మంది విజయం సాధించారు. కొంతకాలంగా ఆయా జిల్లాల్లో పార్టీ పార్టీ కార్యకలాపాలు కూడా మొదలయ్యాయి. అయినా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు గులాబీ పార్టీ దూరంగా ఉంది. అయితే వారం రోజులుగా గులాబీ నేతలు బీఎస్పీ(BSP) అభ్యర్థి కోసం పనిచేస్తున్నారు. పరోక్షంగా పనిచేస్తున్నారు. ఇంటర్నల్గా పార్టీ అభిమానులు, కార్యకర్తలతో సమావేశమై కాంగ్రెస్, బీజేపీని ఓడించాలని కోరుతున్నారు. బీసీ అభ్యర్థి అయిన ప్రసన్న హరికృష్ణకు మద్దతు ఇవ్వాలని సూచిస్తున్నారు. కొందరు విద్యావంతులకు మాజీ మంత్రులు ఫోన్ చేసి ప్రసన్న హరికృష్ణకు ఓటు వేయాలని రిక్వెస్ట్ చేస్తున్నట్టు సమాచారం.
సీనియర్ నేతల ఖర్చు!
మరోవైపు కొందరు బీఆర్ఎస్ నేతలు ప్రసన్న కుమార్ గెలుపు కోసం సొంతంగా డబ్బులు కూడా ఖర్చు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తమ నియోజకవర్గంలోని ఓటర్ల జాబితా తెప్పించుకుని వారికి నేరుగా పోన్ చేసి మాట్లాడుతున్నారు. తర్వాత భోజనాలు, విందులు సైతం ఏర్పాటు చేస్తున్నారు. మరికొందరు నేతలు ప్రచారం ముగియడంతో పోల్ మేనేజ్మెంట్పై దృష్టి సారించారు.
రహస్య ఎజెండా వెనుక టార్గెట్?
నామినేషన్ల ఉపసంహరణ పూర్తయిన తర్వాత బీఆర్ఎస్ తన పొలిటికల్ ప్లాన్ను అమలు చేస్తున్నట్లు సమాచారం. నేరుగా ఓటర్లను కలిసి బీఎస్పీ అభ్యర్థికి ఓటు వేయాలని ప్రచారం చేస్తోంది. బీఆర్ఎస్ నేత, కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్సింగ్ కూడా ఎమ్మెల్సీ బరిలో ఉన్నారు. అయినా ఆయనకు మద్దతు ఇవ్వకుండా బీఎస్పీ నేత ప్రసన్న హరికృష్ణకు మద్దతు ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఈ రహస్య వ్యూహం వెనుక ఉద్దేశం ఏమిటన్న చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ను ఓడించడమా లేక బీజేపీ అభ్యర్థికి పరోక్షంగా సహకరిచండమా లేక రెండు జాతీయ పార్టీలను ఏకకాలంలో కట్టడి చేయడమా అన్న డిస్కషన్ జరుగుతోంది.