Homeఆంధ్రప్రదేశ్‌ఏపీలో కొత్త కొలువులకు బ్రేక్‌ : జగన్‌ నిర్ణయంతో కన్‌ఫర్మ్‌

ఏపీలో కొత్త కొలువులకు బ్రేక్‌ : జగన్‌ నిర్ణయంతో కన్‌ఫర్మ్‌

CM Jagan
ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇరు రాష్ట్రాల్లోనూ నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. కళ్లు కాయలు కాసేలా నిరీక్షిస్తున్నారు. కొలువుతోనే ఈ ఫ్యామిలీకైనా భవిష్యత్‌. పెళ్లి, జీవితంలో స్థిరపడటం లాంటి చాలా అంశాలు ముడిపడి ఉంటాయి. అయితే ఏపీలో కొత్త సర్కార్ కొలువులు లేనట్టేనని తెలుస్తోంది. ఉన్న ఉద్యోగులపై ప్రత్యేక విభాగం.. స్టాఫ్ రివ్యూ సెల్ ఏర్పాటు చేయడంతో దీనికి మరింత బలం చేకూరుస్తోంది.

Also Read: కాంగ్రెస్‌ సీనియర్‌‌ లీడర్ల ఐక్యతారాగం

ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన పరిణామాలను ఉదహరిస్తున్నారు. ఉన్న ప్రభుత్వ ఉద్యోగులతోనే సర్దుబాటు చేస్తారు తప్ప.. కొత్తగా ఉద్యోగాల కల్పన ఉండదనేది దీని సారాంశం. ఏపీలో జగన్ సర్కార్ ఏర్పడిన తర్వాత గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు తప్ప మరో కొలువు ఏర్పడలేదు. దీంతో సందేహాలు సహజంగానే వస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల పునఃసమీక్ష కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసింది. ఆ విభాగంలో సిబ్బందిని నియమించేందుకు వీలుగా శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు? వారందరూ అవసరమా? అదనంగా ఉన్న వారిని ఎక్కడైనా సర్దుబాటు చేయవచ్చా? ఏ విభాగాల్లో ఎక్కువ పని ఉంది? ఎక్కడ తక్కువ పని ఉంది? ఇలాంటి వివరాలన్నీ సేకరించి, అధ్యయనం చేసి ఒక నివేదిక సమర్పించే అవకాశం ఉంది.

ఉమ్మడిరాష్ట్రంలో ఒక ప్రయోగాన్ని పరిశీలిస్తే కచ్చితంగా అదే జరుగుతుందని చెప్పాల్సి వస్తోంది. 1990లో ప్రభుత్వ కార్యాలయాల్లోకి కంప్యూటర్లు వచ్చాయి. పని సులభతరమైంది. దీంతో… ‘ఆఫీసుల్లో ఇంత మంది ఉద్యోగులు అవసరమా?’ అనే ప్రశ్న మొదలైంది. ‘స్టాఫ్‌ రివ్యూ కమిటీ’ ఏర్పాటు చేశారు. గంగోపాధ్యాయను చైర్మన్‌గా.. గిర్‌గ్లానీని కన్వీనర్‌గా నియమించారు. ఆ తర్వాత కొన్నాళ్లకే వ్యక్తిగత కారణాలతో గంగోపాధ్యాయ కమిటీ నుంచి తప్పుకొన్నారు. గిర్‌గ్లానీయే ఏకసభ్య కమిటీలా వ్యవహరించారు. అన్నిశాఖల నుంచి ఉద్యోగుల సమాచారం తెప్పించుకున్నారు.

Also Read: జనసేనతో జతకట్టేందుకు టీడీపీ కొత్త స్కెచ్‌

రెగ్యులర్‌ సిబ్బంది ఎందరు, ఔట్‌సోర్స్‌, కాంట్రాక్ట్‌ సిబ్బంది ఎంత మంది అని అధ్యయనం చేసి మొత్తంగా రాష్ట్రంలో 1.35 లక్షల మంది ఉద్యోగులు అదనంగా ఉన్నారని ఆయన తేల్చారు. ఇది అప్పట్లో సంచలనం సృష్టించింది. వారందరినీ తొలగిస్తారనే ఆందోళన మొదలైంది. ఏ ఒక్కరినీ ఉద్యోగాల నుంచి తొలగించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ.. రిటైర్‌ అయిన వారి స్థానంలో కొత్తవారిని నియమించడం ఆగింది. టీచర్లు, పోలీసులు, వైద్య సిబ్బంది వంటి తప్పనిసరి శాఖల్లో తప్ప.. ఇతరత్రా నియామకాలు నిలిపివేస్తూ నెమ్మదిగా ఉద్యోగుల సంఖ్య తగ్గించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల్లో దాదాపు 6 లక్షల మంది పనిచేస్తున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో సుమారు లక్షకు పైగా ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. అవసరమైనచోట కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని నియమించి పనులు చేయించుకుంటున్నారు. ఉద్యోగాల భర్తీకి వార్షిక కేలండర్‌ తెస్తామని సీఎం జగన్‌ ప్రకటించి ఏడాది పూర్తవుతోంది. అయినా, దానిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ ఉద్యోగాల పునఃసమీక్ష కోసం ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేస్తూ ఆదేశాలు వెలువడటం గమనార్హం. దీనిపై నిరుద్యోగుల్లో ఆందోళన మొదలైంది.

వైసీపీ సర్కారు వచ్చిన తర్వాత 1.37 లక్షల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను నియమించింది. ఇతరత్రా శాఖల్లో ఉద్యోగాల భర్తీకి సెలవు పలికింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఈ ఏడాది అక్టోబరులో ప్రొబేషన్‌ ప్రకటించాల్సి ఉంది. దీంతో వారి జీతాల బడ్జెట్‌ భారీగా పెరుగుతుంది. ఇప్పటికే ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల చెల్లింపులకు సర్కారు నెలానెలా తలకిందులవుతోంది. కొత్త నియామకాలపై ఇప్పట్లో దృష్టి సారించే పరిస్థితి లేదంటున్నారు. ఇప్పుడు ఉద్యోగాల పునఃసమీక్ష విభాగం ఏర్పాటుతో పద్ధతి ప్రకారం కొత్త కొలువులకు మంగళం పలుకుతారనే అభిప్రాయం కలుగుతోంది. దానికి తగ్గట్టు ప్రభుత్వం అడుగులు వేయడంతో మరింత ఆందోళన నెలకొంది. ఈ లెక్కన ఇక భవిష్యత్తులో కూడా ఏపీలో ఉద్యోగాల రిక్రూట్‌మెంట్‌ ఉండదనేది జగన్‌ నిర్ణయంతో మరోసారి తేటతెల్లమైంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

2 COMMENTS

Comments are closed.

Exit mobile version