Telangana, BJP targets KCR: దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ(BJP) ముందడుగు వేస్తోంది. లోక్ సభ ఎన్నికలతోపాటు స్టేట్ల ఎన్నికలు ఒకేసారి జరిపించేందుకు సిద్ధమవుతోంది. లోక్ సభతోపాటు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తేనే బీజేపీకి కలిసొస్తుందని భావిస్తోంది. ఇందులో భాగంగా వచ్చే ఎన్నికలు జమిలిగా నిర్వహించాలని చూస్తోంది. గతంలో కూడా ఇలాగే చేయాలని చూసినా కుదరకపోవడంతో ప్రయత్నాన్ని విరమించుకుంది. కానీ ఈసారి మాత్రం 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ ఎన్నికలను లోక్ సభతో పాటే జరపాలని ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తోంది.
ఎన్నికల నిర్వహణ బాధ్యత ఎన్నికల సంఘానిదే. సార్వత్రిక ఎన్నికలకు ఆరు నెలల లోపు ఎక్కడైనా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటే వాటిని సార్వత్రిక ఎన్నికలతో పాటు నిర్వహించేందుకు వెసులుబాటు ఉంటుంది. గత ఎ న్నికల్లో కూడా తెలంగాణలో జమిలి ఎన్నికలు నిర్వహించాలని చూసినా కేసీఆర్(KCR) ముందే గ్రహించి 8 నెలల ముందే అసెంబ్లీ రద్దు చేసి దాని ప్రభావం నుంచి తప్పించుకున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి మాత్రం జమిలి ఎన్నికలకే తెలంగాణను సమాయత్తం చేయాలని చూస్తోంది. 2024 ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికలతోపాటే తెలంగాణ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
జమిలి ఎన్నికలకే కమలనాథులు మొగ్గు చూపుతున్నారు. లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే ప్రజాధనం కూడా వృథా కాదని భావిస్తున్న తరుణంలో అన్ని స్టేట్ల ఎన్నికలను కూడా లోక్ సభతోపాటు నిర్వహిస్తే ఖర్చు తగ్గుతుందని తెలుస్తోంది. దీనిపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫారసులు చేసింది. అయితే సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి రోడ్ మ్యాప్ రూపొందించే పనిలో లా కమిషన్ నిమగ్నమైంది.
ఆర్టికల్ 370 రద్దు, రామజన్మభూమిలో ఆలయ నిర్మాణం వంటి అసాధ్యమనుకున్న వాటినే సుసాధ్యం చేసిన ఎన్డీఏ-2 సర్కారు, లా కమిషన్ సిఫార్సులు అందిన వెంటనే అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్క తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలతో ప్రయోజనం పొందాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర కూడా ప్రజాధనం వృథా కావద్దనే ఉద్దేశంతోనే జమిలి ఎన్నికల వైపు చూస్తున్నట్లు సమాచారం.
టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో ఉన్న అసంతృప్తులను తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. ఇటీవల పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి తీరుతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సీనియర్లను తమ వైపు తిప్పుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే పలువురు బీజేపీతో మంతనాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో కాషాయ కండువా కప్పుకునేందుకు పలువురు నేతలు రెడీ అవుతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో వారిని పార్టీలో చేర్చుకోవాలని చూస్తోంది. ఇంతవరకు టచ్ లో ఉన్న నేతల్ని త్వరలో పార్టీలో చేర్చే కార్యక్రమం చేపట్టేందకు పార్టీ ఏర్పాట్లు చేస్తుందని సమాచారం.
ఓటు బ్యాంకును ప్రభావితం చేసే కులం, మతం, ప్రాంతం వంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వాలని బీజేపీ చూస్తోంది. దేశవ్యాప్తంగా ఓబీసీ ఓటు బ్యాంకును తనకు అనుకూలంగా మలుచుకోవాలని ప్రయత్నిస్తోంది. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా తెలంగాణ నేత డాక్టర్ కె. లక్ష్మణ్ ను నియమించి అన్ని పార్టీలకు సవాల్ విసురుతోంది. ఓబీసీ ఓట్లు రాబట్టుకునే క్రమంలో బీజేపీ ఇంకా ముందే ఉంటోంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు దళిత-మైనార్టీ వర్గాలను అక్కున చేర్చుకోవడంతో బీజేపీ సైతం వారిని దగ్గర చేసుకునే పనిలో పడింది.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Bjps plan to defeat kcr
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com