Amit Shah Telangana: దేశ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగిన బీజేపీ.. ఉత్తర భారత దేశంలో ఢిల్లీ మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లో పట్టు సాధించింది. ఈశాన్య రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ ఒక్కటే కాంగ్రెస్ చేతిలో ఉంది. తాజాగా బెంగాల్లోనూ బీజేపీ పాగా వేసింది. ఇక ఇప్పుడు బీజేపీ దక్షిణాదిపై ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్నాటక, తెలంగాణలో గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో 2028లో జరిగే ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధమవుతోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ రాజకీయాలపై స్పష్టమైన సంకేతం ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఇకపై ఏ రాష్ట్రంలోనైనా ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి రావాలన్నదే లక్ష్యమని స్పష్టం చేశారు.
తెలంగాణ, పంజాబ్పై ప్రత్యేక వ్యూహం.
తెలంగాణ, పంజాబ్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటిగా పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే బీజేపీ వ్యూహం రూపొందిస్తోంది. దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని అమిత్షా తెలిపారు. ఈ వ్యాఖ్యలు బీజేపీ రాజకీయ వ్యూహంలో ముఖ్యమైన మలుపును సూచిస్తున్నాయి. గతంలో ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో పొత్తుల ద్వారా అడుగుపెట్టిన బీజేపీ, ఇప్పుడు ఒంటరి బలంపై మరింత విశ్వాసం పెంచుకుంది. ఇది పార్టీ తన సొంత ఆధారాలను విస్తరించాలని, స్వతంత్రంగా అధికారం సాధించాలని భావిస్తోందని తెలియజేస్తోంది.
తెలంగాణలో బలహీనంగానే..
తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉండగా, బీఆర్ఎస్, ఏఐఎంఐఎం వంటి ప్రాంతీయ పార్టీలు కూడా బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ పొత్తులు తిరస్కరించడం రాష్ట్ర రాజకీయాలను మరింత ఆసక్తికరంగా మార్చనుంది. యూనిఫామ్ సివిల్ కోడ్పై కీలక ప్రకటనఅమిత్ షా మరో ముఖ్యమైన విషయం చెప్పారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేస్తామని. ఇది బీజేపీ ముఖ్య సిద్ధాంతాల్లో ఒకటైన యూనిఫామ్ సివిల్ కోడ్ను దక్షిణాది రాష్ట్రాలకు కూడా విస్తరించాలన్న ఆలోచనలో ఉంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో అమలు చేయడం ద్వారా పార్టీ తన విజన్ను స్పష్టం చేస్తోంది.
తెలంగాణలో పట్టు చిక్కేనా?
ఒంటరి పోటీ ప్రకటన తెలంగాణ రాజకీయ దృక్పథాన్ని మార్చేస్తుందని విశ్లేషకులు అంటున్నారు. పొత్తు ఆశల్లో ఉన్న చిన్న పార్టీలకు ఇది ఎదురుదెబ్బ కావచ్చు. బీజేపీ తన సొంత ఓటు బ్యాంకును విస్తరించి, స్వతంత్ర శక్తిగా ఎదగాలని ప్రయత్నిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో బలం పెంచుకోవాలన్న బీజేపీ లక్ష్యం స్పష్టమవుతోంది. ఇది దీర్ఘకాలిక వ్యూహం కావచ్చు. పంజాబ్తోపాటు తెలంగాణను కూడా ఒంటరి పోటీ మోడల్గా తీసుకురావడం ద్వారా బీజేపీ దేశవ్యాప్తంగా తన సానుకూలతను మరింత బలోపేతం చేసుకోవాలని చూస్తోంది.
అమిత్ షా వ్యాఖ్యలు కేవలం తెలంగాణకు మాత్రమే కాకుండా, బీజేపీ జాతీయ స్థాయి రాజకీయ వ్యూహంలోని ముఖ్యమైన మార్పును తెలియజేస్తున్నాయి. పొత్తులపై ఆధారపడకుండా సొంత బలంతో అధికారం సాధించాలన్న లక్ష్యం దక్షిణ భారతదేశంలో పార్టీ విస్తరణకు కీలకమవుతుంది. రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాలు మరింత ఉత్కంఠభరితంగా మారనున్నాయి.

