JP Nadda: రానున్న రోజుల్లో కేసీఆర్ ను ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టడం ఖాయమని.. ప్రజలు బీజేపీ కి మద్దతు ఇవ్వడం ఖాయమని.. కేసీఆర్ నడ్డివిరిచి ఇంట్లో కూర్చోబెడతామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. వరంగల్ లో 3వ విడత బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభలో జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలుగులో ప్రసంగం మొదలు పెట్టిన నడ్డా కేసీఆర్ ను గద్దెదించడమే ధ్యేయమని ప్రకటించారు.

ఓరుగల్లు గడ్డ పై అడుగుపెట్టడం నా అదృష్టం గా భావిస్తున్నానని నడ్డా అన్నారు. 3వ విడత “ప్రజా సంగ్రామ యాత్ర” ముగింపు సభలో పాల్గొనే అవకాశం నాకు వచ్చిందని.. పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే… కేసీఆర్ అంధకారంలోకి నెట్టేసిన తెలంగాణలో వెలుగులు నింపాలనేదే మా కర్తవ్యం అన్నారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వం… ఈ కేసీఆర్ ప్రభుత్వం అని అన్నారు.

నేను 2వ విడత పాదయాత్ర కు వచ్చినప్పుడు కూడా… ఆ సమయంలో బండి సంజయ్ ని అరెస్ట్ చేశారని.. రానున్న రోజుల్లో కేసీఆర్ ను ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టడం ఖాయమని స్పష్టం చేశారు. అప్పట్లో నిజాం జన సభలు పెట్టుకోవద్దని చివరి ఫర్మాణా జారీ చేశాడు… అదే ఆయనకు చివరిది అయిందని.. ఇప్పుడు కేసీఆర్ కూడా సభలు పెట్టుకోవద్దని ఫర్మాణాలు జారీ చేస్తున్నాడు. కేసీఆర్ కు కూడా ఇదే చివరి ఫార్మాణా అవుతుంది అని హెచ్చరించారు.

తెలంగాణలో వరదలు వచ్చినప్పుడు కేంద్రం నిధులు మంజూరు చేసినా… కేసీఆర్ వాటిని ఖర్చు చేయలేదని.. కేంద్రం ఇచ్చే నిధులను కేసీఆర్ దారి మళ్లిస్తున్నాడు కేంద్రం ఇచ్చే నిధులతో… తన బొమ్మ పెట్టుకుని, తన స్కీమ్స్ గా ప్రచారం చేసుకుంటున్నాడని ధ్వజమెత్తాడు.
తెలంగాణ ను ఏర్పాటు చేయాలని కాకినాడ లో మొదట తీర్మానం చేసిందే బీజేపీనని.. కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ కు ATM లా మారిందని నడ్డా విమర్శించారు. రూ.40 వేల కోట్ల ప్రాజెక్టు ను 1.40వేల కోట్లకు పెంచుకుని, డబ్బు దండుకున్నాడని ఆరోపించారు.
మజ్లిస్ కు భయపడే.. కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవం జరపడం లేదని.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. ‘తెలంగాణ విమోచన దినోత్సవం’ ను అధికారికంగా జరుపుతామన్నారు. బీజేపీ అంటేనే కేసీఆర్ భయపడుతున్నాడు దుబ్బాక, హుజురాబాద్ లో కేసీఆర్ కు చుక్కలు చూపించామని.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ కు చుక్కలు చూపిస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ అవినీతి, తానాసాహి పాలనను బొందపెడతామని నడ్డా హెచ్చరికలు జారీ చేశారు.
ఊహించినదాని కంటే ఎక్కువగానే బీజేపీ సభకు జనాలు వచ్చారు. ఈ సభ సక్సెస్ అయ్యిందనే చెప్పొచ్చు. బీజేపీ నేతలంతా తరలివచ్చి ఈ సభలో పాల్గొన్నారు. సభలో కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహా ముఖ్య నాయకులంతా ప్రసంగించారు.