దేశంలోనే ఉత్తరప్రదేశ్ పెద్ద రాష్ర్టం.ఇక్కడ విజయాన్ని బట్టే దేశంలో అధికారం హస్తగతం అవుతుందనేది సత్యం. దీన్ని గుర్తించిన రాజకీయ నాయకులు ఇక్కడ తన ఆధిపత్యం నిరూపించుకోవాలని భావిస్తున్నాయి. గత ఎన్నికల్లో విజయఢంకా మోగించిన బీజేపీ ఈ సారి ఎదురీదుతోంది. యోగి ఆదిత్యనాథ్ పై అసంతృప్తి పార్టీని పాతాళంలోకి దింపుతోందని గుర్తించారు. దీని నుంచి బయటపడేందుకు కావాల్సిన వ్యూహాలను రచిస్తున్నారు.
శాంతి భద్రతలు, కరోనా కట్టడిపై యోగి ఆదిత్యనాథ్ పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. దీంతో ఉత్తరప్రదేశ్ పరిస్థితిపై ప్రధాని నరేంద్రమోడీ, హోం మంత్రి అమిత్ షా నిత్యం సమీక్షిస్తున్నారు. పార్టీ విజయంపై ఏ నిర్ణయాలు తీసుకోవాలనే దానిపై తర్జనభర్జన పడుతున్నారు. పార్టీని గట్టెక్కించాలనే భావనతో ముందుకు కదులుతున్నారు. మోడీ ఇమేజ్ పడిపోతుందనే ఉద్దేశాన్ని తొలగించాలనే తపనతో ప్రణాళికలు రచిస్తున్నారు.
ప్రధాని మోడీకి ఆప్తుడైన ఏకే శర్మను ఉత్తరప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడిగా నియమించారు. కాంగ్రెస్ నేత జితిన్ ప్రసాదను పార్టీలోకి తీసుకొచ్చారు. రానున్న ఎన్నికల్లో ఆయన కీలకంగా మారనున్నారు. యోగి ఆదిత్యనాథ్ పై బ్రాహ్మణ సామాజిక వర్గం వ్యతిరేకంగా ఉండటంతో ఏకే శర్మ నియామకాన్ని చేపట్టారు. రానున్న కాలంలో ఉత్తరప్రదేశ్ పార్టీలో మరిన్ని మార్పులు ఉండే అవకాశముంది. మొత్తంమీద ఆపరేషన్ ఉత్తరప్రదేశ్ ను మోడీ, షా ప్రారభించినట్లే.