BJP South India Strategy: దక్షిణాది రాష్ట్రాల విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా దృష్టి పెట్టింది. ఇకనుంచి అంత సులువుగా విడిచిపెట్టకూడదని భావిస్తోంది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి పార్లమెంటులో ఎదురైన పరిణామంతో తీవ్ర షాక్ లో ఉంది కేంద్రం. అయితే దీనిని ఒక గుణపాఠంగా తీసుకుంది. అందుకే దక్షిణాది రాష్ట్రాలపై ఫుల్ ఫోకస్ పెట్టింది. కేవలం దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకించడం వల్లే పార్లమెంటులో ఈ బిల్లు పాస్ కాలేదని భావిస్తోంది. అందుకే దక్షిణాదిలో ఉన్న ఐదు రాష్ట్రాల్లో ఈసారి సత్తా చాటాలని చూస్తోంది. ముఖ్యంగా తెలంగాణ, తమిళనాడు, కేరళలో ఎలాగైనా పాగా వేయాలని చూస్తోంది. అవకాశం ఉంటే సొంతంగా.. లేకుంటే మిత్రుల పరంగా ముందుకు వెళ్లాలని భావిస్తోంది. 2029 ఎన్నికలను కసిగానే కొట్టాలని చూస్తోంది.
* తెలంగాణ పై ఫుల్ ఫోకస్..
తెలంగాణపై ఈసారి ప్రత్యేక దృష్టి పెట్టాలని భావిస్తోంది భారతీయ జనతా పార్టీ. ఇప్పటికే దానికి సంబంధించిన ఆచరణ సైతం ప్రారంభించింది. 2029 ఎన్నికల్లో తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాల్లో కనీసం 12 కు పైగా సాధించాలని చూస్తోంది. అవసరం అనుకుంటే భారత రాష్ట్ర సమితిలో ఉన్న కీలక నాయకులందరినీ బిజెపిలోకి రప్పించాలని చూస్తోంది. నిన్ననే ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో అధికారంలోకి రావడమే కాదు.. మెజారిటీ ఎంపీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా ఆలోచన చేస్తోంది. అందుకు ఏ చిన్న అవకాశాన్ని జారవిడిచుకునే పరిస్థితిలో లేదు భారతీయ జనతా పార్టీ.
* తమిళనాడు పై గురి..
తమిళనాడులో సైతం బలమైన సీట్లపై గురి పెట్టింది. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 27 సీట్లలో మాత్రమే పొత్తులో భాగంగా పోటీ చేస్తుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో 12 శాతం ఓట్లను కైవసం చేసుకుంది బిజెపి. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి ద్వారా ముందుకు వెళ్తోంది. పెరిగే సీట్లు, ఓట్లను దృష్టిలో పెట్టుకొని ఒక ప్రణాళిక రచించనుంది 2029 సార్వత్రిక ఎన్నికలకు. తద్వారా బలమైన అభ్యర్థులను రంగంలోకి దించి వీలైనంతవరకు ఎంపీ సీట్లను పెంచుకోవాలని చూస్తోంది భారతీయ జనతా పార్టీ.
* కర్ణాటకలో ఈసారి స్వీప్..
కర్ణాటకలో ఈసారి స్వీప్ చేయాలని భావిస్తోంది భారతీయ జనతా పార్టీ. దక్షిణాది రాష్ట్రాల్లో బిజెపి నేరుగా అధికారంలోకి వచ్చింది ఆ రాష్ట్రంలోనే. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం బిజెపి సత్తా చాటింది. అయితే 2029 సార్వత్రిక ఎన్నికల్లో ఏకపక్షంగా విజయం సాధించేందుకు గట్టిగానే పావులు కదుపుతోంది బిజెపి.
* కేరళలో సైతం..
కేరళలో సైతం వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి బలమైన రాజకీయ పక్షంగా నిలవాలని చూస్తోంది భారతీయ జనతా పార్టీ. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను దించింది. సీట్ల కంటే ఓట్ల శాతాన్ని పెంచుకోవాలని చూస్తోంది. ఇప్పటికే ఆ రాష్ట్ర రాజధాని కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటింది బిజెపి. అలా వచ్చే ఎన్నికల నాటికి కేరళలో బలమైన నియోజకవర్గాలను టార్గెట్ చేసి అవకాశం ఉంది. ఒకవైపు లెఫ్ట్ కూటమి.. మరోవైపు కాంగ్రెస్ కూటమి కొట్లాటలో తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది బిజెపి.
* ఏపీలో శత శాతం
ఏపీలో అయితే మూడు పార్టీల తో ఉమ్మడి ప్రభుత్వం నడుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో 25 పార్లమెంట్ స్థానాలకు 21 సీట్లను కూటమి కైవసం చేసుకుంది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం 25 కు 25 పార్లమెంట్ సీట్లే టార్గెట్ గా పావులు కదుపుతోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ నుంచి పది పార్లమెంటు సీట్లను పొత్తులో భాగంగా కోరుకుంటుంది బిజెపి. తద్వారా దక్షిణాది రాష్ట్రాల నుంచి దాదాపు 100కు పైగా పార్లమెంట్ సీట్లను కైవసం చేసుకుంటే.. ఉత్తరాది నుంచి మరో 250 స్థానాలను సాధిస్తే సునాయాసంగా కేంద్రంలో అధికారంలోకి రావచ్చని అంచనా ఉంది. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు బిగించడం ద్వారా అనుకున్నది సాధించాలని చూస్తోంది. మరి అందులో ఎంత సక్సెస్ అవుతుందో చూడాలి.