Badvel Elections రాజకీయాల్లో అభిప్రాయభేదాలు సహజం.. కలుపుకుపోవాలే కానీ.. తెలంగాణ కోసం గొంగళి పురుగును అయినా ముద్దు పెట్టుకుంటానన్నాడు కేసీఆర్.. అధికారం కోసమే ఎంత బెండ్ కావడానికైనా సిద్ధపడుతారు చంద్రబాబు అంటారు.. అందుకే వారి సంసారాలు సాఫీగా సాగుతున్నాయి.. కానీ కలుపుకుపోలేని పార్టీలు ఉంటే ఎలా? ఆ పొత్తు పొడుస్తుందా? విడుస్తుందా? అంటే ఖచ్చితంగా విఫలం అవుతుంది. ఇప్పుడు ఏపీలో బీజేపీ, జనసేన పొత్తుపై కూడా ‘బద్వేలు’ ఉప ఎన్నిక కాకరేపేలా ఉంది.
ఎందుకో కానీ.. అవకాశం ఉన్నా కూడా జనసేనాని పవన్ కళ్యాణ్ ‘బద్వేల్’ ఉప ఎన్నికల్లో పోటీ పడకుండా ‘చనిపోయిన అభ్యర్థి భార్య’నే నిలబడిందన్న కారణంతో పోటీ నుంచి తప్పుకున్నాడు. తాను విలువలతో కూడిన రాజకీయం చేస్తానని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే అన్ని పార్టీలు ఏకగ్రీవానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
అయితే టీడీపీ ఇప్పటికే అభ్యర్థిని నిలపగా.. తాజాగా జనసేన మిత్రపక్షం బీజేపీ ‘బద్వేలు’లో పోటికి రెడీ కావడం హాట్ టాపిక్ గా మారింది. నిజానికి ఏపీలో బీజేపీ-జనసేన ఒక కూటమిగా వెళుతున్నాయి. ఇటీవలే బద్వేలు ఉప ఎన్నికపై పవన్ కళ్యాణ్-సోము వీర్రాజులు భేటి అయ్యారు. ఎవరు పోటీచేయాలనే దానిపై సమాలోచనలు జరిపారు. కానీ ఏమైందో ఏమో సడెన్ గా పుట్టపర్తి పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ తమ పార్టీ జనసేన ‘బద్వేలు’లో పోటీచేయడం లేదని.. చనిపోయిన ఎమ్మెల్యే కుటుంబానికి సంఘీభావంగా ఏకగ్రీవం కోసం వైదొలుగుతున్నట్టు ప్రకటించాడు. ఈ ప్రకటన సంచలనమైంది.
నిజానికి పవన్ ఈ మాట అన్నాడంటే అది బీజేపీ మాట కూడా. ఎందుకంటే ఈ రెండు పార్టీలో ఏపీలో పొత్తులో ఉన్నాయి. కలిసి పోటీచేస్తున్నాయి. కానీ పవన్ బద్వేలులో పోటీ చేయవద్దన్న పిలుపును బీజేపీ అతిక్రమించింది. పోటీకి రెడీ అయ్యింది.
బద్వేలు ఉప ఎన్నికకు బీజేపీ శ్రేణులు సిద్ధం కావాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పిలుపునివ్వడం సంచలనమైంది.. జగన్ పార్టీకి భయపడాల్సిన పనిలేదని చెప్పారు. కడపలో బీజేపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. జిల్లా నేతలతో అభ్యర్థి ఎంపికపై చర్చించారు. దీంతో బద్వేలు బరిలో బీజేపీ నిలవబోతోందని సోము వీర్రాజు అధికారికంగా ప్రకటించినట్టైంది. పవన్ ఏకగ్రీవం చేయాలని.. జనసేన పోటీచేయడం లేదని ప్రకటించాక కూడా దాన్ని విభేదిస్తూ బీజేపీ బరిలో ఉంటుందని సోము వీర్రాజు చేసిన ప్రకటన రెండు పార్టీల మధ్య పొత్తుపై ప్రభావం చూపే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
మరోవైపు సానుభూతి కోణంలో పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ నేతలు చెబుతున్నారు. దీనిపై టీడీపీ అధిష్టానం సైతం త్వరలో నిర్ణయం తీసుకోవడానికి రెడీ అయ్యింది.
ఇలా జనసేనాని పవన్ కళ్యాణ్ చెప్పినా కూడా వినకుండా ఏపీలో బరిలోకి దిగుతున్న బీజేపీ తీరు చర్చనీయాంశమవుతోంది. దీన్ని బట్టి వీరి మధ్య విభేదాలు వచ్చాయా? విడిపోతున్నారా? మరి ఈ భేదాభిప్రాయాలు ఏంటీ? అన్న చర్చ సాగుతోంది.