దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ 70 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో అధికార ఆమ్ఆద్మీ పార్టీ, బీజేపీ హోరాహోరీగా తలపడ్డాయి. దానికి తగినట్లుగానే ప్రస్తుతం ఫలితాల ట్రెండ్స్ వస్తున్నాయి. ఎగ్జిట్ పోల్ అంచనాలు ఎగ్జాక్ట్ ఫలితాలు అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పోస్టల్ బ్యాలెట్లో బీజేపీ ఆధిక్యం కనబర్చింది. ఇక ఈవీఎం ఓట్ల లెక్కింపులోనూ బీజేపీ అదే దూకుడు కనబర్చింది. మూడు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత 50 శాతానికిపైగా ఓట్లతో బీజేపీ 50 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 36ను దాటేసింది. ఇక అధికార ఆప్ పార్టీ ఆధిక్యం 20 స్థానాలకు దిగువన ఆధిక్యం కనబరుస్తోంది.
ముస్లిం నియోజకవర్గాల్లోనూ బీజేపీ దూకుడు..
రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు వరకు 12 ముస్లిం నియోజకవర్గాల్లో అధికార ఆప్ పార్టీ 10 స్థానాల్లో ఆధిక్యం కనబర్చింది. ఇక మూడో రౌండ్ లెక్కింపు తర్వాత ఈ ట్రెండ్స్ కూడా ఒక్కసారిగా మారిపోయాయి. ముస్లింలు ప్రభావం చూపే 12 నియోజకవర్గాల్లో బీజేపీ 7 స్థానాల్లో లీడింగ్లోకి వచ్చింది. దీంతో ఆప్కు ముస్లిం ఓటర్లు కూడా దూరం అయినట్లు కనిపిస్తోంది. ఇక ఢిల్లీలో 15 శాతం ఉన్న దళితులు గతంలో ఆప్కు అండగా నిలిచారు. ఈ ఎన్నికల్లో 10 శాతానికిపైగా దళితులు బీజేపీవైపు మొగ్గు చూపారని సమాచారం. ఈ ప్రభావంతోనే బీజేపీ 50 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది.
మూడో రౌండ్ తర్వాత లీడ్లోకి ఇద్దరు అగ్రనేతలు..
ఇక ఈవీఎం కౌంటింగ్ మూడో రౌండ్ ముగిసన తర్వాత అధికార ఆప్ పార్టీకి చెందిన ముగ్గురు కీలక నేతల్లో ఇద్దరు స్వల్ప లీడ్లోకి వచ్చారు. ఆప్ అధినేత, మాజీ సీఎం కేజ్రీవాల్ పోటీ చేసిన న్యూఢిల్లీ స్థానంలో పోస్టల్ బ్యాలెట్ నుంచి ఈవీఎం మూడో రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యే వరకు కూడా ఆయన వెనుకబడే ఉన్నారు. నాలుగో రౌండ్ కౌంటింగ్లో బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మపై స్వల్ప ఆధిక్యంలోకి వచ్చారు. ఇక మనీష్ సిసోడియా పోటీ చేసిన జంగ్పురాలో మూడో రౌండ్ తర్వాత ఆధిక్యంలోకి వచ్చారు. ఇద్దరూ కౌంటింగ్ ప్రారంభమైన రెండు గంటల తర్వాత ఆధిక్యంలోకి వచ్చారు. ఇక కల్కాజీ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న సీఎం అతిశీ అయితే చాలా వెనుకబడ్డారు. ఆమె సమీప బీజేపీ అభ్యర్థిపై 2 వేలపైచిలుకు ఓట్లతో వెనుకబడ్డారు.