BJP cabinet Updates: భారతీయ జనతా పార్టీ( Bhartiya Janata Party) భారీ వ్యూహంతో ఉంది. 2029లో గెలిచి వరుసగా నాలుగోసారి అధికారంలోకి రావాలని భావిస్తోంది. అందుకు ఇప్పటి నుంచే వ్యూహాలను అమలు చేస్తోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎంపీ సీట్లను పెంచుకునేందుకు గట్టి వ్యూహరచన చేస్తోంది. అందులో భాగంగా వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. దక్షిణాది రాష్ట్రాల నుంచి సామాజిక సమీకరణలను పరిగణలోకి తీసుకుని నియామకాలు చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో బీసీలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ పదవులు కేటాయిస్తోంది. అందులో భాగంగానే రాజ్యసభ సీట్లు వారికి కట్టబెట్టింది. ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి సైతం వారికే ఇచ్చింది. మరోవైపు తమ భాగస్వామ్య పక్షమైన టిడిపికి గవర్నర్ పోస్ట్ కి కేటాయించింది.
జాతీయ పగ్గాలపై ప్రచారం..
మరోవైపు దక్షిణాది రాష్ట్రాల్లోని మహిళా నేతకు బిజెపి అధ్యక్ష పదవి ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. దీంతో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్( Nirmala sitaraman ), రాజమండ్రి ఎంపీ, ఏపీ మాజీ బిజెపి చీఫ్ పురందేశ్వరి పేరు ప్రముఖంగా వినిపించాయి. అయితే పురందేశ్వరి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన నేత. జాతీయ అధ్యక్ష పగ్గాలు పూర్వం నుంచి బిజెపిలో కొనసాగే మహిళా నేతకు అప్పగించేందుకు ఆర్ఎస్ఎస్ మొగ్గు చూపినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కన పురందేశ్వరికి చాన్స్ లేనట్టేనని తెలుస్తోంది. అయితే పురందేశ్వరి సేవలను పార్టీ పరంగా వినియోగించుకోవాలా? ప్రభుత్వపరంగా వినియోగించుకోవాలా? అనే ఆలోచనలు కేంద్ర పెద్దలు ఉన్నారు.
Also Read: Bihar Special incentive revision: బీహార్లో ఓటర్లుగా రోహింగ్యాలు బంగ్లాదేశీయులు… గెలుపు కోసం కుతంత్రం
త్వరలో మంత్రివర్గ విస్తరణ..
త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న వార్తలు వస్తున్నాయి. మూడు రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్రాలకు సంబంధించి బిజెపి నేతలతో పాటు మిత్రపక్షాల ఎంపీలను కేంద్ర క్యాబినెట్ లోకి తీసుకుంటారని ప్రచారం సాగుతోంది. అదే జరిగితే ఏపీకి చాన్స్ లేనట్టే. తమిళనాడు, బీహార్ నుంచి కొంతమంది నేతలకు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. మొన్నటి వరకు బిజెపి జాతీయ అధ్యక్ష పదవి పురందేశ్వరికి( Daggubati Purandeswari) వస్తుందని అంతా భావించారు. అది తప్పిపోయేసరికి కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని టాక్ నడిచింది. యూపీఏ 2 ప్రభుత్వంలో పురందేశ్వరి కేంద్రమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. సమర్థవంతంగా నిర్వహించగలిగారు. అందుకే ఆమెను కేంద్ర క్యాబినెట్ లోకి తీసుకోవడం ఖాయమని తెలుస్తోంది.
లోక్ సభ డిప్యూటీ స్పీకర్ గా..
మరోవైపు పురందేశ్వరిని లోక్సభ డిప్యూటీ స్పీకర్ గా ఎంపిక చేస్తారని ఒక ప్రచారం జోరుగా బయటకు వచ్చింది. ప్రస్తుతం లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఖాళీగా ఉంది. ప్రధాన ప్రతిపక్షానికి ఆ పదవి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఇప్పుడు బిజెపి ఆ ఆలోచన చేయడం లేదు. భవిష్యత్తు రాజకీయ అవసరాల దృష్ట్యా సొంత పార్టీ నేతనే డిప్యూటీ స్పీకర్ గా నియమిస్తారని తెలుస్తోంది. పురందేశ్వరి చక్కటి వాగ్దాటి కలిగిన మహిళా నేత. ఆమె ఇంగ్లీష్ తో పాటు హిందీలో అనర్గళంగా మాట్లాడగలరు. పైగా పార్లమెంటరీ నిబంధనలు పై ఆమెకు అవగాహన ఉంది. అందుకే లోక్సభ డిప్యూటీ స్పీకర్ గా ఆమెకు చాన్స్ దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి ఎలాంటి ప్రకటన వస్తుందో….