BJP 20 Years: ఇటీవల తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. అన్ని సంస్థలు డీఎంకే గెలుస్తుందని ముందస్తు ఫలితాలలో చెప్పేశాయి. కానీ ఒక్క యాక్సిస్ మై ఇండియా మాత్రం టీవీకే గెలుస్తుందని చెప్పింది. అంతే కాదు, తమిళనాడు ఓటర్లు విజయ్ ని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారని ఆ సంస్థ వ్యాఖ్యానించింది. పైగా డీఎంకే అధినేత స్టాలిన్ ఓడిపోతారని చెప్పారు. దీంతో యావత్ దేశం మొత్తం సంచలనంగా చూసింది. అంతకు మించి ఆశ్చర్యపోయింది.
అంతకుమించిన సంచలనం
యాక్సిస్ మై ఇండియా సీఈవో ప్రదీప్ గుప్తా ఈసారి అంతకుమించిన సంచలన విషయాన్ని బయటపెట్టారు. ‘పరిపాలన బాగున్నంత కాలం ప్రజలు పార్టీకి ఓటేస్తారు. అధికారాన్ని కట్టబెడతారు. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. కాంగ్రెస్ దేశరాజకీయాలను చాలా సంవత్సరాల పాటు ఏలింది. 1977 వరకు కాంగ్రెస్ ప్రస్థానం అద్భుతంగా సాగింది. ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నాం కదా’ అంటూ ప్రదీప్ వ్యాఖ్యానించారు.
20 ఏళ్ల వరకు
‘ ఒక రాజకీయ తరం 20 ఏళ్ల వరకు ఉంటుంది. ఆ చక్రం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. 2014లో భారతీయ జనతా పార్టీ 1.0 మొదలైంది. 2.0 పూర్తయింది. ఇప్పుడు 3.0 నడుస్తోంది. గవర్నెన్స్ బాగున్నంత వరకు ఏమీ కాదు. ఒకవేళ తేడా కొడితే ఇబ్బంది ఎదురవుతుంది. బీజేపీకి ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందో లేదో చెప్పలేం. కానీ బీజేపీ రాజకీయ పరాక్రమం ఇంకా 20 ఏళ్లు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికైతే ప్రజల్లో ఎన్డీఏ మీద భారీ అంచనాలు ఉన్నాయి. వచ్చేరోజుల్లో ఎన్డీఏ గొప్పగా పరిపాలించాలని’ ప్రదీప్ అభిప్రాయపడ్డారు.
విమర్శలు
ప్రదీప్ మాట్లాడిన మాటలను బీజేపీ స్వాగతిస్తోంది. ఆయన దేశవ్యాప్తంగా ఉన్నవాస్తవ పరిస్థితిని బయటపెట్టారని బీజేపీ నాయకులు అంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ నాయకులు ప్రదీప్ మీద తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. దేశం ఇప్పటికే ఎమర్జెన్సీలో ఉందని, మరో 20 ఏళ్లు అంటే ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ప్రదీప్ బీజేపీకి అనుకూలంగా మాట్లాడి ఏం చెప్పదలుచుకున్నారో తెలుస్తోందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
