Telangana BJP: తెలంగాణలో అధికార బీఆర్ఎస్ను వచ్చే ఎన్నికల్లో ఓడించడమే లక్ష్యంగా బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే అనేక కార్యక్రమాలు నిర్వహించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటికే 5 విడతల పాదయాత్ర పూర్తిచేశారు. దీంతో పార్టీకి ఊపు వచ్చింది. ఈ క్రమంలో పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయాలని హైకమాండ్ నిర్ణయించింది. ఈమేరకు రాష్ట్ర నేతలకు ఆదేశాలు జారీ చేసింది. నియోజకవర్గ స్థాయిలో బలపడలేదని తేలడంతో గ్రామ, గ్రామానికి వెళ్లాలని ప్రోగ్రాం రూపొందించి నేతలు ఇచ్చింది. స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు, శక్తి కేంద్రాలు, బూత్ కమిటీల బలోపేతం వంటి వాటితో ఇక క్షేత్ర స్థాయి కార్యక్రమాలు ఎక్కువగా చేయాలని నిర్ణయించారు.

ఫిబ్రవరి నుంచి మొదలు..
ఫిబ్రవరి నుంచి ఈ మీటింగ్లు మొదలు కానున్నాయి. ఏకంగా 11 వేల సభలు, సమావేశాలు నిర్వహించాలని హైకమాండ్ స్పష్టం చేసింది. 119 నియోజకవర్గాల్లో 9 వేల శక్తికేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతీ 56 బూత్ కమిటీలకు ఒక శక్తి కేంద్రం ఉంటుంది. ప్రతీ గ్రామంలో కాషాయ జెండాలు కనిపించేలా శక్తికేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిసింది. ప్రతీ శక్తి కేంద్రానికి ప్రముఖ్ను నియమించారు. బూత్ స్థాయిలో ఎలక్షన్ ఇంజనీరింగ్ చేసేందుకు ఈ కమిటీలు ఉపయోగపడతాయి. ఫిబ్రవరి నుంచి ప్రతిరోజూ ప్రజల కళ్ల ముందు కనిపించేలా విస్త్తృతంగా పార్టీ కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించింది.
అగ్రనేతల పర్యటన
ఫిబ్రవరిలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా వంటి అగ్రనేతలు సహా పలువురు కేంద్ర మంత్రులు, పార్టీ జాతీయ నేతలు తెలంగాణలో పర్యటించనున్నారు. నేతల కొరతను అధిగమించేందుకు ఇతర పార్టీల్లో నేతలను చేర్చుకునేందుకు ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగా ఉండటంతో.. చేర్చుకునే విషయంలో మాత్రం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఏ పదవిలోనూ లేని పొంగులేటి శ్రీనివాసరెడ్డి వంటి ప్రజాబలం కలిగిన నేతల విషయంలో వ్యతిరేకత ప్రభావం ఉండదని భావిస్తున్నారు. ఫిబ్రవరిలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని బీజేపీ వర్గాలు ఇప్పటికే ప్రచారం చేస్తున్నాయి.

మొత్తంగా పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే ప్రణాళిక సిద్ధం చేసింది బీజేపీ అధిష్టానం. ఈ టాస్క్ను విజయవంతంగా అమలు చేసేందుకు రాష్ట్ర నాయకత్వం సిద్ధమవుతోంది. ఈమేరకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది.