Homeఆంధ్రప్రదేశ్‌ఏపీలో విద్యుత్ కొనుగోళ్లలో భారీ స్కాం..?

ఏపీలో విద్యుత్ కొనుగోళ్లలో భారీ స్కాం..?

Power Scam in AP
ఏపీ విద్యుత్ కొనుగోళ్లలో భారీ అవినీతి జ‌రుగుతోందా..? వైసీపీ స‌ర్కార్ పెద్దల క‌నుసన్నల్లో ఇది న‌డుస్తోందా..? అన్న ప్రశ్నలు ఇప్పుడు తెర‌పైకి వ‌స్తున్నాయి. గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున కరెంట్ స్కాం జరిగిందని అదే పనిగా ఆరోపించి.. ప్రమాణస్వీకారం వేదిక పైనుంచే అవినీతి మొత్తం బయటపెడతానని చాలెంజ్ చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి. వాటి సంగతేమయిందో కానీ ఇప్పుడు.. ప్రభుత్వం చేస్తున్న చర్యలు.. తీసుకుంటున్న నిర్ణయాలు.. అనుమానాస్పదంగా మారుతున్నాయి. విద్యుత్ నియంత్రణ మండలి ప్రభుత్వానికి తాజా పంపిన ఓ లేఖ ఇప్పుడు.. సంచలనం అవుతోంది. దీనికి కారణం ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్నా నిలిపివేసి అత్యధిక రేటుకు బయట నుంచి కరెంట్ కొనుగోలు చేయడమే.

Also Read: ఎస్‌ఈసీపై సభా హక్కుల ఉల్కంఘన చర్యలు సాధ్యమేనా..?

ప్రభుత్వ ప‌రిధిలో ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి వ‌చ్చే విద్యుత్ స‌రిప‌డ‌క‌పోతే ఆ లోటును పూడ్చేందుకు ప్రభుత్వాలు ప్రైవేటు సంస్థల నుండి క‌రెంటు కొనుగోలు చేస్తుంటాయి. ఇలా చేసిన కొనుగోలులోనే టీడీపీ స‌ర్కార్ అవినీతి చేసింద‌ని జ‌గ‌న్ గ‌తంలో ఆరోపించారు. కానీ ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ కేంద్రాల్లో ఉత్పత్తి నిలిపేసి మ‌రీ ప్రైవేటులో విద్యుత్ కొంటున్నార‌న్న విమ‌ర్శలు వినిపిస్తున్నాయి.

డిసెంబర్, జనవరి నెలల్లో ఏపీ ప్రభుత్వం బయట నుంచి కరెంట్ కొనుగోలు చేసింది. రోజుకు 30 నుంచి 40 మిలియన్ యూనిట్లు కొంటున్నారు. ఇది రాష్ట్రం మొత్తం వినియోగంలో ఇరవై శాతానికిపైగా ఉంటుంది. ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడూ కొనుగోలు చేయరు. పైగా ఒక్కో యూనిట్ ధరను రూ. మూడున్నర నుంచి రూ. నాలుగు వరకూ పెట్టి కొనుగోలు చేశారు. ఇది నిబంధనలకు విరుద్ధం. నిర్ణయించిన ధర కంటే అధికం. దీన్ని గుర్తించిన విద్యుత్ నియంత్రణ మండలి.. డిస్కంలకు నోటీసులు జారీ చేసింది. అధిక ధరకు ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించింది.

Also Read: ఈటల మాటల తూటాలు..: ఏదో తెలియని అసంతృప్తి

విద్యుత్ నియంత్రణ మండలి వివరణ అడగడానికి ఒక్క రేటు మాత్రమే కారణం కాదు.. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ప్రభుత్వ ప్లాంట్లకు ఉన్నప్పటికీ.. వాటిని ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టి.. మూసి వేసి.. బయట నుంచి కరెంట్ కొంటున్నారు. వాటిని దీర్ఘ కాలం రిజర్వ్ షట్‌డౌన్‌లో ఉంచి కొనుగోళ్లు చేస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారని గతంలో విమర్శలు వస్తే ఉత్పత్తి రేటు కన్నా తక్కువ రేటుకు బయట వస్తోందని కొనుగోలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. కానీ.. ఉత్పత్తి రేటు కన్నా ఎక్కువ రేటుకు ఇప్పుడు కొనుగోలు చేస్తున్నారు. దీనిపైనే ఇప్పుడు విమర్శలు వినిపిస్తున్నాయి.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version