Bandi Sanjay: ఎట్టకేలకు ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. మోడీ తగ్గించాక కొన్ని రాష్ట్రాల్లో స్వచ్ఛందంగా రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న వాల్యూ ఆడెడ్ టాక్స్(వ్యాట్)ను స్థానిక ప్రభుత్వాలు తగ్గించాయి. ఇతర రాష్ట్రాల్లో తగ్గించారు కదా.. మన రాష్ట్రంలో ఎందుకు తగ్గించరని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కేసీఆర్ను నిలదీస్తున్నారు. సీఎం కేసీఆర్ తాను వ్యాట్ను తగ్గించబోనని ప్రకటించడంతో బండి మండిపడుతున్నారు. పెట్రోల్ ధరలను తగ్గించేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు బీజేపీ దశల వారీగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజల డిమండ్ కు అనుగుణంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించే వరకు బీజేపీ ఆందోళన కొనసాగిస్తుందని బండి సంజయ్ స్పష్టం చేశారు.

దీపావళి సందర్భంగా ఈనెల 3న పెట్రోల్ ధరలను ఒక్కో లీటర్పై 5రూపాయలు, డీజిల్ పై 10 రూపాయలు కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ప్రజలపై భారం తగ్గించేందుకు రాష్ట్రాలు తమ పన్నుల వాటాను కూడా తగ్గించుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని పిలుపు మేరకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలుసహా దాదాపు 23 రాష్ట్రాల ప్రభుత్వాలు ధరలను తగ్గించాయని, కానీ చంద్రశేఖర్ రావు ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో మొండిగా వ్యవహరిస్తోందంటున్నారు బండి సంజయ్. 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత పెట్రోలు, డీజిల్ పై పెంచిన 4 శాతం వ్యాట్ ను తగ్గించే చర్యలు తీసుకోకుండా సమస్యను పక్కదారి పట్టించేందుకు యత్నిస్తున్నారని సంజయ్ మండి పడ్డారు.

కేసీఆర్ అసలు వ్యాట్ను పెంచలేదని, ఇదివరకే ఉన్న వ్యాట్నే కొనసాగిస్తున్నామని చెబుతున్నారు. కానీ బండి సంజయ్ మాత్రం గతేడాది మే నుండి ఈ ఏడాది నవంబర్ వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్రోల్పై లీటర్కు 8.83 రూపాయలను, డీజిల్పై 5.68 రూపాయలు వ్యాట్ని పెంచిందని, సాధారణంగా ఇన్పుట్ ధర పెరుగుదల సమయంలో అదనపు పన్ను విధింపును కేంద్రం అనుమతించడం లేదని, ఇది ప్రజల పట్ల కేంద్రప్రభుత్వానికి ఉన్న నిబద్ధత అని సంజరు వ్యాఖ్యానించారు. డిసెంబర్ 5న ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో, డిసెంబర్ 6న కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మార్కెట్ యార్డుల వద్ద చమురుపై వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టనున్నాయని, డిసెంబరు 7న మైనార్టీ మోర్చా ధర్నా నిర్వహించనుందని, అయినప్పటికీ టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ పై వ్యాట్ ను తగ్గించకపోతే అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టాలని రాష్ట్ర బీజేపి నిర్ణయించిందని బండి సంజయ్ తెలిపారు.
Also Read: వాహనదారులకు శుభవార్త.. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గే ఛాన్స్!
డిసెంబర్ 1న బీజేవైఎం ఆధ్వర్యంలో 33 జిల్లాల కేంద్రాల్లో ప్లకార్డులు పట్టుకుని నల్లబ్యాడ్జీలతో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తారు. డిసెంబరు 2న మహిళా మోర్చా ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లోని చౌరస్తాల వద్ద చంద్రశేఖర్ రావు ప్రజావ్యతిరేక వైఖరిని చాటిచెప్పే బ్యానర్లతో భారీ నిరసనలు చేపట్టనున్నారు. డిసెంబర్ 3న ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లోని అంబేద్కర్ విగ్రహాల వద్ద ధర్నాలు నిర్వహిస్తారు. డిసెంబర్ 4న ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో గాంధీ విగ్రహాల వద్ద ధర్నాలు కొనసాగిస్తారు.
Also Read: కేసీఆర్ నిర్ణయంతో బీజేపీలోకి టీఆర్ఎస్ నాయకులు ?