Homeజాతీయ వార్తలుతిరుపతిలో ప్రచారానికి తెలంగాణ ఫైర్‌‌ బ్రాండ్‌

తిరుపతిలో ప్రచారానికి తెలంగాణ ఫైర్‌‌ బ్రాండ్‌

Bandi Sanjay
బండి సంజయ్‌.. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆయనో ఫైర్‌‌ బ్రాండ్‌. అందుకే.. బీజేపీ అధిష్టానం ఆయనకు తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ పగ్గాలు అప్పజెప్పింది. ప్రత్యర్థిపై విమర్శలు చేయాలన్నా.. ప్రభుత్వంపై ఫైర్‌‌ అవ్వాలన్నా ఆయనకు ఆయనే సాటి. సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడంలో ఆయన తర్వాతే ఎవరైనా. పార్టీ అధ్యక్షుడిగానూ.. కరీంనగర్‌‌ ఎంపీగానూ ఆయన కొనసాగుతున్నారు. ఇప్పుడు సొంత రాష్ట్రంలో నాగార్జన సాగర్‌‌ ఉప ఎన్నిక బాధ్యతలు మోస్తున్న ఆయన.. ఏపీలోనూ పార్టీకి తన వంతు సహకారం అందించనున్నారని తెలుస్తోంది. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలోనూ ఆయన పాల్గొంటారని సమాచారం.

నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక వ్యవహారాలను పర్యవేక్షిస్తూనే ఆయన తిరుపతికి వస్తారని సమాచారం. ఉప ఎన్నిక పోలింగ్ రోజైన ఏప్రిల్ 17వ తేదీకి వారం రోజుల ముందు ఆయన తిరుపతిలో పర్యటిస్తారని చిత్తూరు జిల్లా బీజేపీ నాయకులు చెబుతున్నారు. తిరుపతి లోక్‌సభతో పాటు నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి ఒకేరోజు పోలింగ్ జరగనుంది. ప్రస్తుతం బండి సంజయ్ నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచార కార్యక్రమాల్లో తీరిక లేకుండా గడుపుతున్నారు. పార్టీ అభ్యర్థి రవికుమార్ నాయక్ తరఫున విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇటీవలే ముగిసిన రెండు శాసన మండలి పట్టభద్ర నియోజకవర్గ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన నేపథ్యంలో.. ఆయన ఈ ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.

నాగార్జున సాగర్‌లో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇంత బిజీ షెడ్యూల్‌లోనూ ఆయన తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి వస్తారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిల్చున్న రత్నప్రభకు మద్దతుగా ఆయన తిరుపతిలో ఇంటింటి ప్రచారంలో పాల్గొనడంతోపాటు బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారని సమాచారం. రోడ్ షో సైతం నిర్వహిస్తారని తెలుస్తోంది. అయితే.. ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు నిర్వహిస్తారనేది ఇంకా స్పష్టత రాలేదు. పోలింగ్ తేదీకి నాలుగైదు రోజుల ముందు ఆయన పర్యటన ఉండొచ్చని చెబుతున్నారు.

ఇప్పటికే బండి సంజయ్.. తిరుపతి ఉప ఎన్నిక వ్యవహారంపై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఓటర్లు తమకు భగవద్గీత కావాలో.. బైబిల్ కావాలో తేల్చుకోవాలంటూ నిప్పు రాజేశారు. కాగా..- బీజేపీ తరఫున ఆ పార్టీ మిత్రపక్షం జనసేన కూడా తిరుపతిలో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోంది. రత్నప్రభను ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ శనివారం తిరుపతిలో పాదయాత్ర నిర్వహించనున్నారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version