తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నాటి విపక్ష నేతగా ఉన్న జగన్ పై పలు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. న్యాయంగానైతే ఏం చేయాలి? వాటిని కోర్టుల్లో ఎదుర్కొని, నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి. కానీ.. జగన్ అలా చేయలేదు. 2019 ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి కాగానే.. ఇప్పటి ప్రభుత్వ హోదాలో.. అప్పటి సర్కారు తనపై వేసిన కేసులను ఉపసంహరించుకున్నారు! అంటే.. సర్కారు వేసిన కేసులను.. సర్కారే ఉపసంహరించుకుంది అనే పద్ధతిలో విత్ డ్రా చేసుకున్నారన్నమాట. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు.. సుమోటోగా విచారించాలని సంచలన నిర్ణయం తీసుకుంది.
టీడీపీ సర్కారు హయాంలో జగన్ పై మొత్తం 11 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఇందులో అనంతపురం జిల్లాలో ఐదు కేసులు, గుంటూరు జిల్లాలో 6 కేసులు ఉన్నాయి. ఈ కేసులను జగన్ ముఖ్యమంత్రి కాగానే వెనక్కి తీసుకున్నారు. డీజీపీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆయా పోలీస్ స్టేషన్లలోని ఆఫీసర్లు ఉపసంహరించుకున్నారు. ఆ విధంగా.. ఎలాంటి విచారణా జరగకుండానే సీఎం ఆ కేసుల నుంచి బయటపడినట్టైంది. దీనిపై అప్పట్లోనే విపక్షాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి.
ఈ తీరుపై హైకోర్టు స్పందించింది. నిబంధనలకు విరుద్ధంగా ఇలా ఉపసంహరిచుకోవడమేంటని ప్రశ్నించింది. వెంటనే మొత్తం 11 కేసులకు సంబంధించి రివిజన్ పిటిషన్లు దాఖలుచేయాలని ఆదేశించింది. ఈ కేసులకు హైకోర్టు రిజిస్ట్రీ నంబర్లు కూడా కేటాయించింది. ఈ కేసులు ఇవాళ కోర్టు ముందు విచారణకు రానున్నాయి.
కాగా.. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వంతోపాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ఫిర్యాదుదారులు, పోలీసులు కూడా ప్రతివాదులు అయ్యారు. వీరితోపాటు ముఖ్యమంత్రి జగన్ కూడా ప్రతివాదిగా ఉన్నారు. అంటే.. ఇప్పుడు సీఎం హోదాలోనే జగన్ విచారణను ఎదుర్కోబోతున్నారు. మరి, ఈ కేసుల విషయంలో న్యాయస్థానం ఎలాంటి తీర్పు చెప్పబోతోంది అన్నది ఉత్కంఠగా మారింది.