ఈ మేరకు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. దీన్ని న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ కేసులో విచారణ కొనసాగించాలని ఏసీబీని ఆదేశించిన కోర్టు.. మే 5లోపు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పింది. ప్రస్తుతం ధూలిపాళ్ల రాజమండ్రి జైలులో ఉన్నారు.
అయితే.. ఆయన క్వాష్ పిటిషన్ వేయడంతో వైసీపీ నేతలు ధూలిపాళ్ల నిజాయితీని ప్రశ్నిస్తున్నారు. నిజంగా ఏ తప్పూ చేయనప్పుడు ఎందుకు విచారణను ఎదుర్కోవట్లేదని ప్రశ్నిస్తున్నారు. క్వాష్ పిటిషన్ వేయాల్సిన అవసరం ఏంటని నిలదీస్తున్నారు. గతంలో.. సంగం డెయిరీలో అక్రమాలపై నోటీసులు జారీచేస్తే.. హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారని, ఇప్పడు కూడా అదే పనిచేస్తున్నారని అంటున్నారు.
సంగం డెయిరీలో ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని, తన గుత్తాధిపత్యంగా డెయిరీని మార్చుకున్నారని ఆరోపిస్తున్నారు. దశాబ్ద కాలానికిపైగా తన ఆధీనంలో ఉంచుకొని.. ఎన్నో అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. ఇవన్నీ ఎక్కడ బయటకు వస్తాయోనని విచారణను తప్పించుకునేందుకు చూస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
అంతేకాదు.. చంద్రబాబు కూడా హైకోర్టుకు వెళ్లి పలు కేసుల విషయంలో స్టే తెచ్చుకున్నారని గుర్తు చేస్తున్నారు. అసలు టీడీపీ నేతలు ఎవ్వరూ విచారణను ఎదుర్కోరా? అని ప్రశ్నిస్తున్నారు. ఏ తప్పూ చేయనప్పుడు ఎందుకు స్టేలు కోరుతున్నారని నిలదీస్తున్నారు. తప్పు చేశారు కాబట్టే.. తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరి, దీనికి టీడీపీ నేతలు ఏం సమాధానం చెబుతారో?