సంగం డెయిరీని అడ్డుపెట్టుకొని అక్రమాలకు పాల్పడ్డారంటూ టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్రను ఆ మధ్య ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సంగం డెయిరీ ఆఫీసులో గతేడాది రూ.44 లక్షలు మాయమయ్యాయని ఆరోపణలు వచ్చాయి. దీంతోపాటు.. ఎన్నో అక్రమాలు సంగం డెయిరీలో చోటు చేసుకున్నాయనే అభియోగాల నేపథ్యంలో ధూలిపాళను అరెస్టు చేశారు. అయితే.. తాజాగా మరోసారి ప్రభుత్వం ఆయనపై చర్యలకు సిద్ధమైంది. ధూలిపాళ ట్రస్టుపై ఫోకస్ చేసింది.
ధూళిపాళ నరేంద్ర ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గతేడాది ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే.. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఆయన 2010 నుంచి సంగం డెయిరీ చైర్మన్ గా ఉంటూ వచ్చారు. ఇన్నేళ్ల కాలంలో ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. ఐదుసార్లు గెలిచినా.. చంద్రబాబు హయాంలో ధూళిపాళకు మంత్రి పదవి రాకపోవడానికి కారణం ఇదేననే వారు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ను అరెస్టు చేయడం టీడీపీలో సంచలనం రేకెత్తించింది.
అయితే.. తాజాగా ప్రభుత్వం ధూలిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్ పై దృష్టి సారించింది. ఈ ట్రస్టుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది. ట్రస్టు వార్షిక వివరాలు ఇవ్వాలని దేవాదాయ శాఖ నోటీసులు ఇచ్చింది. వీరయ్య చౌదరి ట్రస్టుకు సంబంధించిన ఆస్తులు, మేనేజింగ్ ట్రస్టీ, ట్రస్ట్ డీడ్ వంటి వివరాలకు సంబంధించిన కాపీ ఇవ్వాలని కోరింది.
గడిచిన మూడు సంవత్సరాలకు సంబంధించిన వివరాలు అందజేయాలని దేవాదాయ శాఖ సూచించింది. ఇందుకోసం పది రోజుల గడువు ఇస్తున్నట్టు తెలిపింది. ఈ నోటీసులను ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆసుపత్రి గోడకు అంటించడం గమనార్హం. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఈవో భ్రమరాంబ పేరుతో ఈ నోటీసులు జారీ అయ్యాయి.
దీంతో.. ప్రభుత్వం ధూళిపాళపై మరోసారి దృష్టి సారించిందని అంటున్నారు. ఇదంతా జగన్ సర్కారు ఉద్దేశపూర్వకంగానే చేస్తున్న కుట్ర అంటూ టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఆయన జైలుకు వెళ్లి వచ్చాడు కాబట్టి.. టీడీపీ నేతలను సైతం అదేవిధంగా చేయాలని చూస్తున్నాడని ఆరోపిస్తున్నారు. మరి, ఈ ట్రస్టు ఎలా స్పందిస్తుంది? గడువు లోపు వివరాలు అందిస్తుందా? లేదా? అన్నది చూడాలి.