వైసీపీలో ఆశావహులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నామినేటెడ్ పండగ వచ్చేసింది. అయితే.. ఆశావహులు ఎందరో ఉన్నప్పటికీ.. అవకాశాలు ఎవరికి దక్కుతాయన్నదే పాయింటు. అందుతున్న సమాచారం ప్రకారం.. తాను ముందుగా మాట ఇచ్చిన వారిని జగన్ పరిగణనలోకి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. దీని ప్రకారం.. ముందుగా 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన 24 మందికి నామినేటెడ్ పోస్టుల్లో ఛాన్స్ ఇవ్వనున్నట్టు సమాచారం.
రాష్ట్రంలో మొత్తం 175 నియోజకవర్గాలనూ అధికార పార్టీకి చెందిన వారు ప్రొటోకాల్ పదవిలో ఉండేలా చూస్తున్నట్టు సమాచారం. తద్వారా.. వచ్చే ఎన్నికల నాటికి వారు జనాల్లో ఉండాలనేది వ్యూహంగా చెబుతున్నారు. ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులతోపాటు 2019 ఎన్నికల్లో టికెట్ ఆశించి, పొందలేకపోయిన వారికి సైతం ఈ కోటాలో పదవి దక్కేలా ఉంది.
ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 80 కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్లను నియమించనున్నారు. ఈ మొత్తం జాబితా ఇప్పటికే సిద్ధమైపోయింది. అంతేకాదు.. ఈ ఆదివారమే ప్రకటించాలని కూడా అనుకున్నారు. కానీ.. అనివార్య కారణాలతో ఆగిపోయింది. అయితే.. ప్రకటించే వరకూ వచ్చినప్పటికీ.. ఎవరెవరి పేర్లు అందులో ఉన్నాయనే విషయం మాత్రం కనీసంగా కూడా బయటకు పొక్కనీయట్లేదు.
ప్రచారంలో ఉన్నదాని ప్రకారమైతే.. ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులతోపాటు.. టికెట్ ఆశించి భంగపడిన వారికి తొలి ప్రాధాన్యం ఇస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. వీరు కాకుండా.. మొదటి నుంచీ పార్టీకోసం పని చేస్తున్నవారు, పార్టీ అధికారంలోకి వస్తే.. ఎమ్మెల్సీ పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చిన వారు కూడా ఓ 30 మంది వరకు ఉన్నట్టు చెబుతున్నారు. ఇలాంటి వారందరికీ నామినేట్ ద్వారా జగన్ న్యాయం చేయబోతున్నారని టాక్. మరి, వాస్తవ పరిస్థితి ఏంటన్నది మాత్రం జాబితా బయటకు వచ్చిన తర్వాతనే తేలనుంది.