‘‘ఏపీ ప్రభుత్వం అప్పులతోనే బండి నెట్టుకొట్టొస్తోంది, ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్ర భవిష్యత్ ఏంటీ?’’ అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకటీ రెండు కాదు.. సంవత్సరానికి ఏకంగా లక్ష కోట్ల రూపాయలు అప్పు చేస్తోందని అంటున్నారు. కానీ.. గతేడాది రూ.53,700 కోట్ల పైచిలుకు మాత్రమే అప్పులు చేసినట్టు కాగ్ రిపోర్టు వెల్లడించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రభుత్వాల నిర్వహణపై నిశిత పరిశీలన చేసే.. కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నుంచి ఈ తరహా నివేదిక రావడమేంటనేది చాలా మందికి అర్థం కాలేదు. అయితే.. లోతుగా పరిశీలిస్తే అసలు విషయం అర్థమవుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
ప్రభుత్వ పనితీరుపై కాగ్.. ఖచ్చితమైన రిపోర్టు ఇస్తుంది. అయితే.. ఆ వివరాలు ప్రభుత్వం సమర్పించే ఆధారాలపైనే ఆ రిపోర్టు ఆధారపడి ఉంటుంది. రాష్ట్రం తెచ్చే అప్పుల్లో బడ్జెట్ బారోయింగ్స్, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అని రెండు ఉంటాయి. బడ్జెట్ బారోయింగ్స్ లో ప్రభుత్వం నేరుగా తెచ్చే అప్పులు చూపిస్తారు. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ లో కార్పొరేషన్ల పేరుతో తెచ్చే అప్పులు ఉంటాయి. గ్యారంటీల ద్వారా తెచ్చేవి కూడా ఉంటాయి. ఇవి కాగ్ లెక్కల్లోకి రావు. ఆ విధంగా.. సర్కారు చేసే డైరెక్ట్ అప్పులను మాత్రమే కాగ్ రిపోర్టు వివరిస్తుంది.
దీంతో.. ఏపీ సర్కారు స్టేట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్, మెడికల్ కార్పొరేషన్ వంటివిఏర్పాటు చేసి.. ఇన్ డైరెక్టుగా అప్పులు తెస్తోందని సమాచారం. వీటి ద్వారా తెచ్చు అప్పులు కాగ్ రిపోర్టుకు అందవు కాబట్టి.. ఏపీ సర్కారు గతేడాది తెచ్చిన అప్పులు రూ.53,702 కోట్లుగా కాగ్ రిపోర్టు చూపించిందని చెబుతున్నారు ఆర్థిక నిపుణులు.
ఒకరకంగా ఇది ఏమార్చే ప్రక్రియ అని, కాగ్ వీటన్నింటిపై దృష్టి సారించి, అసలు వివరాలను బయటకు తీస్తే.. సర్కారు వాస్తవ అప్పుల లెక్క ఎంత అనేది తేలుతుందని అంటున్నారు. ప్రస్తుత లెక్కల ప్రకారం.. ఏడాదికి ఏపీ సర్కారు చెల్లించాల్సిన వడ్డీనే రూ.30 వేల కోట్ల మేర ఉండొచ్చని అంటున్నారు. ప్రభుత్వ ఉద్దేశపూర్వకంగానే కాగ్ రిపోర్టుకు లెక్కలు అందకుండా చేస్తోందని ఆరోపిస్తున్నారు.