Rahul Gandhi : పాపం రాహుల్‌.. మరో పరువునష్టం కేసు!

Rahul Gandhi : ‘దొంగలందరికీ మోదీ అన్న ఇంటి పేరే ఎందుకుంటుంది!?’ అని విమర్శించిన వయనాడ్‌ ఎంపీ రాహుల్‌ గాంధీని సూరత్‌ కోర్టు దోషిగా తేల్చింది! ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో పార్లమెంటు సభ్యుడిగా రాహుల్‌ అనర్హుడయ్యారు. ఆయన సభ్యత్వాన్ని లోక్‌సభ సచివాలయం కూడా రద్దు చేసింది. ఇది సరిపోదన్నట్టు ఇప్పుడు మరో పరువు నష్టం కేసును రాహుల్‌ గాంధీ ఎదుర్కొంటున్నాడు. ‘నేను క్షమాపణ చెప్పేందుకు వీర సావర్కర్‌ను కాదు. గాంధీ వారసుడిని.’ అని రాహుల్‌గాంధీ […]

Written By: Bhaskar, Updated On : March 25, 2023 8:10 pm
Follow us on

Rahul Gandhi : ‘దొంగలందరికీ మోదీ అన్న ఇంటి పేరే ఎందుకుంటుంది!?’ అని విమర్శించిన వయనాడ్‌ ఎంపీ రాహుల్‌ గాంధీని సూరత్‌ కోర్టు దోషిగా తేల్చింది! ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో పార్లమెంటు సభ్యుడిగా రాహుల్‌ అనర్హుడయ్యారు. ఆయన సభ్యత్వాన్ని లోక్‌సభ సచివాలయం కూడా రద్దు చేసింది. ఇది సరిపోదన్నట్టు ఇప్పుడు మరో పరువు నష్టం కేసును రాహుల్‌ గాంధీ ఎదుర్కొంటున్నాడు. ‘నేను క్షమాపణ చెప్పేందుకు వీర సావర్కర్‌ను కాదు. గాంధీ వారసుడిని.’ అని రాహుల్‌గాంధీ అన్న మాటలు ఇప్పుడు మహారాష్ట్రలో మంటలు రాజేస్తున్నాయి. అక్కడి ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే ఏకంగా రాహుల్‌ గాంధీపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ‘సావర్కర్‌ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. అండమాన్‌ జైలులో శిక్ష అనుభవించారు. అటువంటి ఆయనను దూషించిన రాహుల్‌ను ఎంత విమర్శించినా తక్కువే అవుతుందని’ ధ్వజమెత్తారు.

ఇక రాహుల్‌ వ్యాఖ్యల నేపథ్యంలో మహారాష్ట్ర అసెంబ్లీలో అధికార పార్టీ సభ్యులు రాహుల్‌ చిత్రపటాలను పట్టుకుని చెప్పులతో కొట్టారు. రాహుల్‌ గాంఽధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాహుల్‌గాంధీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, కోర్టు శిక్ష వేసినా ఇంకా బుద్ధి రాలేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చేసిన తప్పునకు క్షమాపణ కోరకుండా సావర్కర్‌ ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఏంటని వారు ప్రశ్నించారు. అధికార పార్టీల నాయకుల నిరసనతో మహా రాష్ట్ర అసెంబ్లీ దద్దరిల్లింది. ఇంత జరుగుతున్నా మహా అసెంబ్లీలో ఒక్క కాంగ్రెస్‌ పార్టీ నాయకుడూ నోరు మెదపకపోవడం గమనార్హం.

ఇక రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్రలో భాగంగా గత ఏడాది నవంబరులో పాదయాత్ర నిర్వహించారు. ఈసందర్భంగా పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. వీర్‌సావర్కర్‌ పై తీవ్ర విమర్శలు చేశారు. సావర్కర్‌ బ్రిటీషర్లకు క్షమాభిక్ష పెట్టాలని పిటీషన్లు రాసేవారన్నారు. తనను అండమాన్‌ జైలు నుంచి విడుదల చేయాలని కోరేవారన్నారు. బ్రిటీష్‌ పాలకుల నుంచి పింఛన్లు కూడా స్వీకరించేవారన్నారు. ఈ వ్యాఖ్యలపై అప్పట్లో మహారాష్ట్రలో బీజేపీ నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రాహుల్‌ గాంధీపై ధ్వజమెత్తారు. ఈక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ తన పత్రిక పాంచజన్యలో వీర్‌ సావర్కర్‌ జీవితచర్రితపై పెద్ద కథనమే ప్రచురించింది. మరో వైపు శనివారం కూడా రాహుల్‌ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నేను సావర్కర్‌ను కాదని, గాంధీల వారసుడినని, క్షమాపణ చెప్పబోనని వ్యాఖ్యానించారు. ఈనేపథ్యంలో మరో పరువు నష్టం కేసును రాహుల్‌గాంధీ ఎదుర్కొవాల్సి వస్తుందేమోనని పరిశీలకులు భావిస్తున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే రాహుల్‌పై కోర్టుకు వెళ్లి ప్రణవ్‌మోదీ లాగే ఫిర్యాదు చేయాలని యోచిస్తున్నారు.