Annamalai Resignation From BJP: భారతీయ జనతా పార్టీ నుంచి అన్నామలై తప్పుకున్నట్టే. ఢిల్లీలో వేచి చూడాలని పార్టీ పెద్దలు చెప్పిన నేపథ్యంలో.. ఆయన అక్కడ ఉన్నాడని చెబుతున్నారు గాని.. రాజ్యసభ సీటు ఇస్తామని వార్తలు వస్తున్నాయి గాని.. అవేవీ వాస్తవం కాకపోవచ్చు. ఎందుకంటే అన్నామలై ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ ప్రకారం ఆయన సొంత పార్టీ పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సొంత పార్టీ పెట్టాలని ఆయన మీద అనుచరులు ఒత్తిడి తీసుకొస్తున్నట్టు ఇటీవల తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కొంతమంది బిజెపి ప్రాథమిక సభ్యత్వానికి కూడా అన్నామలై బాటలోనే రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది.
ఇటీవల తమిళనాడు ఎన్నికల్లో బిజెపి కేంద్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయాలు అన్నామలై కి ఏమాత్రం రుచించలేదని తెలుస్తోంది. అందువల్లే ఆయన రాజీనామా వైపు వెళ్ళినట్టు తెలుస్తోంది. అన్నా డీఎంకేతో పొత్తు.. సీట్ల సర్దుబాటు.. ప్రచారం.. రాష్ట్ర అధ్యక్ష బాధ్యత నుంచి ఆయనను తప్పించడం.. ఇవన్నీ కూడా అన్నామలై లో వేరే భావాన్ని కలిగించాయని వార్తలు వస్తున్నాయి. అందువల్లే ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నారని.. బిజెపి అధిష్టానం రంగంలోకి దిగి నచ్చ చెప్పడానికి ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయిందని సమాచారం.
అన్నా మలై రాజీనామా విషయంలో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఆయన తొందర పడ్డారని.. పార్టీ ప్రయోజనాలను ఆయన అర్థం చేసుకోవడం లేదని బిజెపి నాయకులు అంటున్నారు.. అన్నా మలై వేచి చూస్తే బాగుండేదని చెబుతున్నారు. అన్నామలై ఉదంతాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్న బిజెపి నాయకులు.. ఒక కీలక విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. బిజెపిలో వ్యక్తి ప్రయోజనాలు ఉండవని.. పార్టీ ప్రయోజనాలు మాత్రమే ఉంటాయని వారు వివరిస్తున్నారు.
అస్సాం ముఖ్యమంత్రిగా గతంలో సర్బానంద సోనోవాల్ ఉండేవారు. ఆ తర్వాత హిమంత బీజేపీలో చేరారు. సర్బానంద మంచి నాయకుడే.. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఆయనకు కేంద్రమంత్రి వర్గంలోకి తీసుకున్నారు. హిమంతను అస్సాం ముఖ్యమంత్రి చేశారు. నాడు పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని సోనోవాల్ స్వాగతించారు. కేంద్ర మంత్రివర్గంలోకి సానుకూల ధోరణితో వెళ్లిపోయారు. హిమంత దూకుడు వల్ల అస్సాం వరుసగా అధికారంలోకి వచ్చింది. అక్కడ బిజెపి అధికారంలో ఉండడం వల్ల అనేక రకాల పనులను చేపట్టేందుకు కేంద్రానికి ఆస్కారం ఏర్పడుతోంది.
అన్నా మలై వ్యవహారాన్ని లోతుగా పరిశీలిస్తున్న జాతీయవాదులు ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. 1995 -96 కాలంలో నరేంద్ర మోడీ గుజరాత్ నుంచి బయటికి రావాల్సి వచ్చింది. పార్టీ కి దూరం కావాల్సి వచ్చింది. దీంతో ఆయన చాలా కాలం పాటు ఢిల్లీకి పరిమితం కావలసి వచ్చింది. జాతీయ పార్టీ కార్యాలయంలో ఒక చిన్న గదిలో.. మరొక నాయకుడితో ఆయన ఉండాల్సి వచ్చింది. ఇలా అనేక రోజులు ఉన్న తర్వాత.. మళ్లీ గుజరాత్ రాష్ట్రం లోకి ఆయన వచ్చారు. ఈసారి ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు మూడోసారి దేశ ప్రధాన మంత్రిగా కొనసాగుతున్నారు. అంతటి నరేంద్ర మోడీకి ఇటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు.. పార్టీ అధినాయకత్వం నిర్ణయానికి అన్నా మలై కట్టుబడి ఉండాల్సిన అవసరాన్ని వారు గుర్తు చేస్తున్నారు..
