వైసీపీ అధిష్టానానికి నచ్చని పేరు ఏదైనా ఉందంటే.. అది రఘురామకృష్ణరాజు. ఆర్ ఆర్ ఆర్ అప్డేట్స్ తెలుసుకోవడానికి తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటే.. ఆ పేరుతో పొలిటికల్ అప్డేట్ వస్తోందంటే చాలు.. అధికార పార్టీకి చిర్రెత్తుతోంది. అయితే.. ఈ వ్యవహారంలో ఒకటి అనుకుంటే.. మరొకటి అయ్యిందన్నది కన్ఫామ్. దీంతో.. ఎక్కడ పొరపాటు జరిగింది? సింపుల్ గా డీల్ చేయాల్సిన వ్యవహారాన్ని గెలికి పెంటచేసుకున్నామా? అని వైసీపీలో అంతర్మథనం మొదలైందని అంటున్నారు.
ఎంపీని అరెస్టు చేయడం.. లోక్ సభ స్పీకర్ ఇన్వాల్వ్ కావడం వంటి చర్యలతో రఘురామ ఇష్యూ దేశవ్యాప్తం అయిపోయింది. మొదట్నుంచీ ఆయన్ను సరిగా డీల్ చేయకపోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని పార్టీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. టీడీపీ నుంచి పిలిచిమరీ టిక్కెట్ ఇచ్చిన వ్యక్తితో.. ఇంతటి రభస తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందని ఇప్పుడు చర్చించుకుంటున్నట్టు తెలుస్తోంది.
అయితే.. కొందరు మధ్యవర్తుల వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని అంటున్నారు. వీరి కారణంగానే హైకమాండ్ తో రాజుకు దూరం పెరిగిందని చెబుతున్నారు. ఆయన్ను బూతులు తిడుతూ రెచ్చగొట్టడం వల్లనే.. క్రమంగా రఘురామ కూడా అదే పంథాలో సమాధానం చెప్పడం మొదలుపెట్టారని అంటున్నారు. ఈ పరిస్థితిని రాజకీయంగా డీల్ చేయాల్సిన వారు.. అణిచివేయడానికి ప్రాధాన్యం ఇవ్వడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అంటున్నారు.
స్మూత్ గా చర్చించి రాజీకి తీసుకొచ్చే ప్రయత్నం జరగలేదని భావిస్తున్నట్టు సమాచారం. అధినేతకు సలహాదారులుగా ఉన్నవారే అగ్నిలో ఆజ్యం పోశారని ఇతర నేతలు అనుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే.. ఈ వ్యవహారంలో ఒకే ఒక సలహాదారును బోనెక్కించే ప్రయత్నం జరుగుతోందని అంటున్నారు. ఆయనవల్లే పరిస్థితి ఇక్కడిదాకా వచ్చిందని వైసీపీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారట.
మొత్తానికి.. మాటలతోనే తెగ్గొట్టాల్సిన వ్యవహారాన్ని.. అధికారం ఉపయోగించేదాకా తెచ్చారని సొంత నేతలే అంటున్నారట. ఈ ఎపిసోడ్ వల్ల పార్టీకి నష్టమే తప్ప.. మేలు జరిగింది ఏమీ లేదని మెజారిటీ భావిస్తున్నారట. దీంతో.. రఘురామ పేరు చెబితేనే ఒకరకమైన ఫీలింగ్ ఏర్పడే పరిస్థితి వచ్చిందట పార్టీలో! మరి, ఈ పరిస్థితి రాబోయే రోజుల్లో ఇంకెలా ఉంటుందో చూడాలి.