Amit Shah: చివరి నిమిషంలో అమిత్ షా ఎంటర్.. మారిన మంత్రుల జాబితా

మంత్రి పదవుల కేటాయింపులో చంద్రబాబు ఒక ఫార్ములాను అనుసరించారు. ప్రతి ఏడుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి కేటాయించారు. ఈ లెక్కనే 21 మంది ఎమ్మెల్యేలు ఉన్న జనసేనకు మూడు మంత్రి పదవులు దక్కాయి.

Written By: Dharma, Updated On : June 12, 2024 10:56 am

Amit Shah

Follow us on

Amit Shah: బిజెపిలో సీనియర్లకు మంత్రి పదవులు దక్కలేదు ఎందుకు? హై కమాండ్ కలుగజేసుకుందా? చివరి నిమిషంలో మార్పు జరిగిందా? అమిత్ షా ప్రమేయంతోనే పేర్లు మార్చారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బిజెపి నుంచి సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు వంటి సీనియర్లు గెలిచారు. అందులో ఒకరికి తప్పకుండా మంత్రి పదవి దక్కుతుందని అంచనా వేశారు. కానీ అనూహ్యంగా ధర్మవరం నుంచి గెలిచిన సత్య కుమార్ యాదవ్ కు మంత్రి పదవి దక్కింది. ఆయన కూడా సీనియర్ అయినా.. చంద్రబాబుకు అత్యంత ఆప్తులుగా సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ ఉన్నారు. వారిద్దరికీ కాదని సత్యకుమార్ యాదవ్ కు దక్కడం విశేషం.

అయితే మంత్రి పదవుల కేటాయింపులో చంద్రబాబు ఒక ఫార్ములాను అనుసరించారు. ప్రతి ఏడుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి కేటాయించారు. ఈ లెక్కనే 21 మంది ఎమ్మెల్యేలు ఉన్న జనసేనకు మూడు మంత్రి పదవులు దక్కాయి. 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న బిజెపికి ఒక మంత్రి పదవి దక్కింది. అయితే సత్య కుమార్ యాదవ్ కు సామాజిక వర్గం కలిసి రావడం, బిజెపి పెద్దల సిఫార్సు ఉండడం కారణంతో చంద్రబాబు ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే క్యాబినెట్లో నలుగురు కమ్మ ఎమ్మెల్యేలకు చోటిచ్చారు. ఆ లెక్కన సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ కు ఛాన్స్ దక్కకుండా పోయినట్లు ప్రచారం జరుగుతోంది.

మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత బిజెపి అగ్రనేత అమిత్ షా చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. అప్పటికే మంత్రివర్గ జాబితాతో చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు. అప్పుడే సత్య కుమార్ యాదవ్ పేరును అమిత్ షా సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి బిజెపికి రెండు మంత్రి పదవులు దక్కుతాయని భావించారు. సుజనా చౌదరి, కామినేని శ్రీనివాసుల్లో ఒకరికి ఛాన్స్ ఇస్తారని.. మరో మంత్రి పదవి సత్యకుమారి యాదవ్ కు దక్కుతుందని అంతా అంచనా వేశారు. కానీ చంద్రబాబు ఏడుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి ఫార్ములాకు అమిత్ షా సైతం ఆమోద ముద్ర వేశారు.చంద్రబాబు నిర్ణయానికి వదిలేశారు. దీంతో అనివార్య పరిస్థితుల్లో సత్య కుమార్ ఒక్కరికే బిజెపి నుంచి అవకాశం కల్పించారు చంద్రబాబు.