ఎన్నికలు వచ్చాయంటే పొత్తులు పొడుస్తుంటాయ్. ఎలాగైనా విజయం సాధించాలి.. ఎలాగైనా అధికార పార్టీని గద్దె దించాలని ప్రయత్నిస్తూనే ఉంటారు. ఒకప్పుడు శత్రువులైన వారు కూడా ఒక్కో సందర్భంలో మిత్రులుగా మారుతుంటారు. పొత్తుతో బరిలోకి దిగుతుంటారు. ఇది రాష్ట్ర రాజకీయాల్లోనూ.. దేశ రాజకీయాల్లోనూ జరుగుతుంటుంది. దేశంలో అయితే ఎన్డీయే, యూపీఏ కూటమిలు కొనసాగుతున్నాయి.
Also Read: మారటోరియంలోనూ లోన్లు కట్టారా..! : మీకో శుభవార్త
ఇప్పటివరకు అటు ఎన్డీయే కూటమిలో, ఇటు మహాఘట్ బంధన్లో ‘సీట్ల’ తకరారు జరిగింది. ఎన్డీయే కూటమిలో చిరాగ్ మంటలు… మినహాయిస్తే.. నితీశ్, బీజేపీ మధ్య వ్యవహారం సఖ్యతగానే ఉంది. ఎటొచ్చీ మహాఘట్ బంధన్ లోనే సీట్ల పంపిణీపై తీవ్ర దుమారం రేగింది. ‘తేజస్వీ యాదవ్ అపరిపక్వ నేత’ అని కాంగ్రెస్ కయ్యానికి కాలు దువ్వింది. దీంతో కూటమికి బీటలొస్తాయని అందరూ భావించారు.
చివరకు మహా ఘట్ బంధన్లోనూ సీట్ల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చేసింది. కేవలం సీట్ల వ్యవహారమే కాదు… ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై కూడా క్లారిటీ వచ్చేసింది. మహాఘట్ బంధన్ గనక అధికారంలోకి వస్తే ఆర్జేడీ నేత, లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ముందుకు తెచ్చారు. 243 స్థానాల్లో ఆర్జేడీ 144 సీట్లలో పోటీ చేస్తుండగా, 70 స్థానాల్లో కాంగ్రెస్ బరిలోకి దిగనుంది. మిగితా 29 స్థానాలను వామపక్షాలకు విడిచిపెట్టారు.
ఇందులో సీపీఐ(ఎంఎల్) 19 సీట్లు, సిపీఎం 4సీట్లు, సీపీఐ 6 సీట్లలో పోటీ చేస్తాయి. ఈ కూటమిలో మిగిలిన పక్షాలైన వికాస్శీల్ ఇన్సాఫ్ పార్టీ (విఐపి), జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం)లకు తమ కోటానుంచి సీట్లు కేటాయిస్తామని తేజస్వియాదవ్ చేసిన ప్రకటనతో విఐపి అసంతృప్తి ప్రకటించింది. తాము మహాకూటమినుంచి తప్పుకుంటున్నట్లు విఐపి నేత ముకేశ్ సాహ్ని ప్రకటించారు.
Also Read: ‘అటల్ టన్నెల్’ తో దేశానికి ఏం ఉపయోగం?
అయితే ఒకవేళ మనసు మార్చుకుని మళ్లీ బీజేపీ వైపు చిరాగ్ వస్తే… మాత్రం 121 సీట్లలోనే సర్దుబాటు చేయనున్నారు. ఇక… జేడీయూ కూడా ఇదే చేయనుంది. జితిన్ రాం మాంఝికి 121 సీట్లలోనే కొన్ని సీట్లను కేటాయించనుంది. ఇలా… అన్ని పక్షాల్లోనూ సీట్ల పంపిణీ కొలిక్కి రావడంతో ఇక కార్యక్షేత్రంపై దృష్టి సారించాయి. చివరగా అధికార ఎన్డీయేలోనూ సీట్ల ఒప్పందం కుదరడంతో ఇరు పార్టీలూ 50:50 సీట్లలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని నేడు అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం 243 సీట్లకు గాను జేడీయూ 122 సీట్లలో, బీజేపీ 121 సీట్లలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. ఎన్డీఏలో సీట్ల కుంపటి రాజేసిన రాంవిలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ- ఎన్డీఏ నుంచి తప్పుకుని సొంతంగా బిహార్ లో అన్ని సీట్లకూ పోటీ చేయాలని నిర్ణయించడం ఓ కీలక పరిణామం. లోక్ జనశక్తి 42 సీట్లు అడిగితే కేవలం 15 సీట్లు మాత్రమే ఇస్తానని బీజేపీ స్పష్టం చేయడంతో ఎన్డీఏ నుంచి విడిపోతామని రాంవిలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ ప్రకటించారు.