15 ఏళ్లపాటు కాంగ్రెస్ శాసించిన నేత.. పార్టీలో తిరుగులేని వ్యక్తిగా.. సోనియాగాంధీ రాజకీయ కార్యదర్శిగా.. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టిన గుజరాత్ నేత అహ్మద్ పటేల్ మరణించారు. 71 సంవత్సరాల వయసు ఉన్న ఆయన.. అక్టోబర్లో కరోనా బారిన పడ్డారు. పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్తో నేడు చనిపోయినట్లు ఆయన కొడుకు ట్విటర్ ద్వారా ప్రకటించాడు.
అహ్మద్పటేల్కు ప్రజలకు సంబంధం లేకపోయినా.. ప్రజల ఓట్లతో గెలవలేకపోయినా.. సోనియా రాజకీయ అంతరంగిక సలహాదారుగా చాలా ఏళ్లు వ్యవహారాలను శాసించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ రాష్ట్రంలో ఎంత ప్రజాబలంతో నెగ్గి వచ్చిన వారు కూడా.. అహ్మద్ పటేల్కు విలువ ఇవ్వాల్సి వచ్చేది. సోనియాకు వారు ఏం మొరపెట్టుకోవాలన్నా ముందు అహ్మద్ పటేల్ను దర్శనం తప్పనిసరి. సోనియాకు తన సలహాలతో పార్టీని ఈయన ఎంత బలోపేతం చేశారో అందరికీ తెలిసిందే. కానీ.. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ఇంతటి దీన స్థితిని ఎదుర్కొనడంలో మాత్రం అహ్మద్ పటేల్ కూ క్రెడిట్ ఉండనే ఉంటుంది.
పార్టీని నాశనం చేయడంలో సోనియాకు దక్కే క్రెడిట్లో అహ్మద్ పటేల్ కు మెజారిటీ వాటా దక్కుతుంది. చివరి వరకూ ఆయన మాటకు సోనియా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆయనను రాజ్యసభకు పంపేందుకు కొన్నేళ్ల కిందట చాలా కష్టపడ్డారు. గుజరాత్ అసెంబ్లీ కోటాలో రాజ్యసభకు ఎన్నిక చేసేందుకు పెద్ద తతంగమే నడిచింది. ఆయన ఎన్నికను అడ్డుకునేందుకు బీజేపీ కూడా చాలావరకు శ్రమించింది. అయితే కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో నిర్వహించిన శిబిరంతో చివరకు రాజ్యసభకు ఎన్నికయ్యారు.
అలా ప్రజాబలం లేని వారి కోసం సోనియా చాలా ప్రాధాన్యతను ఇచ్చారు. ఇదే సమయంలో ప్రజల బలం కలిగిన వారు కాంగ్రెస్కు దూరం అవుతున్నా పెద్దగా లెక్కచేయలేదు. ఒకవైపు సోనియాగాంధీ అనారోగ్యంతో వార్తల్లో నిలుస్తున్నారు. ఢిల్లీ కాలుష్యానికి దూరంగా ఆమె గోవాకు తరలివెళ్లారు. ఈ టైంలోనే ఆమె ఆప్తుడు అహ్మద్ పటేల్ మరణించారు.