Homeఆంధ్రప్రదేశ్‌CM Jagan: జగన్ చేసింది కరెక్టా? రాంగా?

CM Jagan: జగన్ చేసింది కరెక్టా? రాంగా?

CM Jagan: చంద్రబాబు అరెస్ట్ తరువాత ఏపీ రాజకీయాల్లో హీట్ పెరిగింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఓ మాజీ సీఎం, ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిని అరెస్టు చేస్తే సానుభూతి వస్తుందని తెలిసినా జగన్ సర్కార్ వెనుకాడక పోవడానికి కారణం ఏమిటి అన్నది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. జగన్ అన్ని ఆలోచించుకున్న తర్వాతే చంద్రబాబు విషయంలో ముందడుగు వేశారని.. పక్క వ్యూహంతోనే అడుగులు వేస్తున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబుకు రిమాండ్ విధించి దాదాపు పది రోజులు గడుస్తోంది. మరికొన్ని రోజులు జైల్లో ఉంచడమే జగన్ లక్ష్యమని తెలుస్తోంది.

ఏపీలో ఏ క్షణాన్నైనా ఎన్నికలు రావొచ్చని ప్రచారం జరుగుతోంది. ముందస్తు ఎన్నికలు, జమిలీ ఎన్నికలు రావొచ్చని రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లోనే దీనిపై నిర్ణయం ఉంటుందని భావిస్తున్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటే పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయని ఓ ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాల్లో ఎన్నికలు వాయిదా వేసి.. ఒకేసారి జమిలీ ఎన్నికలు నిర్వహిస్తారని మరో ప్రచారం ఉంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సరిగ్గా ఇదే సమయం చూసి చంద్రబాబుపై జగన్ పదునైన అస్త్రాన్ని వాడారు. అరెస్టుకు ఇదే సరైన సమయమని భావించి ఐపీసీ సెక్షన్ 409 ప్రయోగం ద్వారా వెంటనే బెయిల్ రాకుండా వ్యూహం పన్నారు. మరో మూడు కేసుల్లో కస్టడీ కోరుతూ సిఐడిచే పిటిషన్లు దాఖలు చేయించారు. పాత కేసులను తిరగ దోడుతూ చంద్రబాబుకు చుక్కలు చూపిస్తున్నారు. ఒక కేసులో బెయిల్ వచ్చినా.. మరో కేసులో కస్టడీకి తీసుకునేలా పక్కాగా ప్లాన్ రూపొందించారు. అటు చంద్రబాబు కేసుల విచారణ కొనసాగుతుండగానే.. ఇటు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయించారు. చంద్రబాబు అరెస్టుపై సానుభూతి దక్కకుండా.. అసెంబ్లీలో చంద్రబాబు, లోకేష్, ఇతర టిడిపి నాయకుల అవినీతిపై చర్చ జరగాలన్నదే జగన్ ప్లాన్. అందుకు తగ్గట్టుగానే అసెంబ్లీలో వ్యవహారం నడిపిస్తున్నారు.

జగన్ వ్యూహానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు విలవిలలాడుతున్నాయి. తెలుగుదేశం పార్టీలో ఎలక్షన్ మేనేజ్మెంట్ మొత్తం చంద్రబాబు కనుసనల్లోనే జరుగుతుంది. అభ్యర్థుల ఎంపిక నుంచి ఎన్నికల ఖర్చు వరకు ఆయన చూసుకుంటారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న సంకేతాలు వస్తున్న నేపథ్యంలో టిడిపి శ్రేణుల్లో ఒక రకమైన అయోమయం నెలకొంది. మరోవైపు లోకేష్న సైతం అరెస్టు చేయనున్నట్లు ప్రచారం చేయిస్తున్నారు. ఇది కూడా టిడిపిని నైరాశ్యంలో పడేస్తోంది. మొత్తానికైతే జగన్ తన వ్యూహాలతో టిడిపి శ్రేణులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. కానీ ఈ మొత్తం వ్యవహారంతో టిడిపికి సానుభూతి పెరిగే అవకాశాలు ఉన్నాయని వైసీపీ శ్రేణులు భయపడుతున్నాయి. జగన్ దూకుడుగావ్యవహరిస్తుండడం సైతం కొందరు సీనియర్లకు మింగుడు పడడం లేదు. కానీ అధినేతకు ఎదురు చెప్పే అవకాశాలు వైసీపీలో లేవు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version