Aam Aadmi Party: పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం రాష్ట్రంలోని 22 పట్టణాల్లో ప్రతీ సోమవారం సాయంత్రం “ఏక్ శామ్ శివ్ కా నామ్” కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కార్యక్రమాల్లో శివుని పేరిట భజనలు, పూజలు నిర్వహించి, ధార్మిక సంస్కృతిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. “జై శ్రీరాం”, “హర హర మహాదేవ్” నినాదాలు ఇచ్చి, ప్రభుత్వ నిధులతోనే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.అమృత్సర్లోని వాల్మీకి ఆశ్రమం అభివృద్ధి, పాటియాలాలో కాళీమాత ఆలయ నిర్మాణం వంటి ప్రకటనలు కూడా చేశారు. ముఖ్యమంత్రి తీర్థయాత్ర యోజన కింద సాలాసర్ బాలాజీ, ఖాతూశ్యాం, మథుర-బృందావన్, హృషికేష్-హరిద్వార్, ఆనంద్పూర్, అమృత్సర్ వంటి క్షేత్రాలకు ప్రజలను తీసుకెళ్లే హామీ ఇచ్చారు.
పార్టీ కన్వీనర్ ప్రకటన..
ఈ పథకాలను పార్టీ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. సీఎం భగవంత్ మాన్, కేజ్రీవాల్ ఇద్దరూ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ప్రజలు “జై శ్రీరాం” అని నినదించగా, నాయకులు “జై సియారామ్” అని చెప్పారు. కేజ్రీవాల్ మాట్లాడుతుండగా సీఎం భగవంత్ మాన్ను చూసి ప్రజలు చప్పట్లు కొట్టడం గమనార్హం.
ఆరు నెలల్లో పంజాబ్ ఎన్నికలు..
పంజాబ్లో ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పట్టణాల్లో హిందువులు గణనీయంగా ఉండటం, గ్రామాల్లో సిక్కులు ఎక్కువగా ఉండటం వల్ల హిందూ ఓట్లను ఆకర్షించడానికి ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు కనిపిస్తోంది. ఆప్ తనను తాను సెక్యులర్ పార్టీగా చెప్పుకుంటూ, ఇప్పుడు స్పష్టంగా హిందూ ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటోంది.
ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి ప్రయత్నాలు..
సాధారణంగా ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలు అంటే బీజేపీ గుర్తుకు వస్తుంది. సీఎం అయితే యోగా ఆదిత్యనాథ్ గుర్తొస్తారు. కానీ దేశంలో హిందువుల పునరేకీకరణ నేపథ్యంలో ఇప్పుడు అన్ని పార్టీలు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఢిల్లీలో రెండోసారి అధికారంలోకి రావడానికి హనుమాన్ చాలీసా పాడిన ఆప్, పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కూడా చండీ మంత్రం, హనుమాన్ చాలీసా ఆలపించింది. ఇప్పుడు పంజాబ్లో కూడా ఇదే వ్యూహం అనుసరిస్తోంది. అయితే కేజ్రీవాల్ ప్రకటనలు చేయడం, సీఎం భగవంత్ మాన్ వెనకబడి ఉండటం వల్ల పార్టీలో సీఎం, కన్వీనర్ మధ్య సఖ్యత లేదన్న అభిప్రాయం బయటకు వస్తోంది. రామనామం ఓట్లు తెచ్చే అవకాశం ఉందని ఆప్ భావిస్తోంది.
ప్రతి పార్టీ తన ఓటు బ్యాంకు కోసమే..
దేశంలో రాజకీయ పార్టీలు కులం, మతం ఆధారంగా రాజకీయాలుచేస్తున్నాయి. అయితే ప్రస్తుతం హిందుత్వం బలంగా ఉంది. ఈ నేపథ్యంలో ఒకప్పుడు మైనారిటీలకు మద్దతు ఇస్తూ సెక్యూలరిజం అని చెప్పుకున్న పార్టీలు కూడా ఇప్పుడు హిందూ ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఆప్ తన మొదటి దశలో “సెక్యులరిజం”, “వ్యవస్థ మార్పు” అనే నినాదాలతో అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు హిందూ మెజారిటీ ఓట్లు అవసరమైన చోట హిందూ ధార్మిక కార్యక్రమాలు చేపట్టడం ద్వారా తన వ్యూహాన్ని మార్చుకుంటోంది.
పంజాబ్లో సిక్కు-హిందూ సమతుల్యత ఉంది. పట్టణాల్లో హిందువులు ఎక్కువగా ఉండటం వల్ల వారి ఓట్లు కావాలంటే ఇలాంటి కార్యక్రమాలు అనివార్యం అని ఆప్ భావిస్తోంది. అయితే ఇది పార్టీ ఆదర్శాలకు విరుద్ధంగా ఉందని విమర్శకులు అంటున్నారు. మొత్తం మీద, ఈ కార్యక్రమాలు ఆప్కు హిందూ ఓట్లు తెచ్చే అవకాశం ఉందా లేదా అనేది ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతే తెలుస్తుంది. రాజకీయాల్లో “సెక్యులరిజం” అనేది చాలా సార్లు సందర్భానుసారం మారిపోతుందని ఈ సంఘటన మరోసారి నిరూపిస్తోంది.
