NEET UG 2024 Leak : మెడికల్ కాలేజీల్లో ప్రవేశానికి కేంద్రం ఆధ్వన్యంలోని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చాలా ఏళ్లుగా కామన్ ఎంట్రన్స్ను కొన్నేళ్లుగా నిర్వహిస్తోంది. గతేడాది వరకూ నీట్ నిర్వహణ సాఫీగానే సాగింది. కానీ ఈ ఏడాది మొదలైన వివాదం ఇంకా సమసిపోలేదు. ఈ ఏడాది భారీగా విద్యార్థులు 700లకుపైగా మార్కులు సాధించారు. ఒకేపరీక్ష కేంద్రంలో ఎక్కువ మందికి ఎక్కువ మార్కులు రావడం అనుమానాలకు తావిచ్చింది. దీంతో నీట్ ఫలితాలపై పలువురు విద్యార్థులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈమేరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. 25 లక్షల మంది భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని ఆచితూచి నిర్ణయంతీసుకుంటోంది. మరోవైపు నీట్ లీకేజీ నిజమే అని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కోర్టుకు తెలిపింది. అయితే ఒక్క బిహార్లో మాత్రమే లీక్ అయినట్లు విన్నవించింది. దీంతో నీట్ ప్రశ్నపత్రం లీక్ అయినట్లు కోర్టు ధ్రువీకరించింది. ఇక అంతకు ముందు గ్రేస్ మార్కులు కలపడంపైనా అభ్యంతరం తెలిపింది. దీంతో కొందరికి మళ్లీ పరీక్ష నిర్వహించారు. అయితే తుది ఫలితాలు మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఈ క్రమంలో జూన్లో వెల్లడించిన నీట్ యూజీ ఫలితాల్లో గుజరాత్కు చెందిన ఒక విద్యార్థి మార్క్షీట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 12వ తరగతిలో ఫెయిల్ అయిన ఓ అభ్యర్థి నీట్ యూజీ పరీక్షలో 705 మార్కులు సాధించడమే ఇందుకు కారణం. జూలై 20న, నగరం, కేంద్రాల వారీగా నీట్ ఫలితాలు ఎన్టీఏవెబ్సైట్ లో అప్లోడ్ చేయబడ్డాయి. అప్పటి నుంచి ఈ విద్యార్థి మళ్లీ వార్తల్లో నిలిచింది.
ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఫెయిల్..
మార్క్ షీట్ వైరల్ అవుతున్న విద్యార్థిని పేరు అంజలి హిర్జీభాయ్ పటేల్. గుజరాత్కు చెందిన ఈ విద్యార్థి పేరిట ఉన్న రెండు మార్కుల పత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకటి 12వ తరగతి పరీక్ష, రెండోది నీట్ యూజీ మార్క్ షీట్. వీటి ప్రకారం అంజలి 12వ తరగతిలో ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఫెయిల్ అయింది. ఇక నీట్ మార్క్లు మాత్రం 705 సాదించింది. ఇక గుజరాత్ బోర్డు 12వ సైన్స్ పరీక్షలో అంజలి 700 మార్కులకు కేవలం 352 మాత్రేమ సాధించింది. కెమిస్ట్రీలో 100కి 31, ఫిజిక్స్లో కేవలం 21 మార్కులు సాధించింది. ఈ రెండు సబ్జెక్టుల్లోనూ ఆమె ఫెయిల్ అయింది. బయాలజీ, కంప్యూటర్ సైన్స్లో కూడా ఆమెకు మార్కులు అంతగా లేవు. కానీ నీట్ యూజీ – 2024లో మాత్రం 705 మార్కులు రావడం ఆశ్చర్యపర్చింది.
నీట్లో హై స్కోర్..
ఇదిలా ఉంటే.. ఈ రెండు మార్క్ షీట్ల ప్రమాణికతపై ఎలాంటి నిర్ధారణ, స్పష్టత లేదు. సోషల్ మీడియాలో రెండు మార్కు షీట్లలో విద్యార్థి వివరాలు ఒకేలా ఉన్నాయి. దీని ప్రకారం, అంజలి హిర్జీభాయ్ పటేల్ నీట్ యూజీ 2024 పరీక్షలో 720 మార్కులకు 705 మార్కులు సాధించింది. ఇందులో, ఆమె భౌతికశాస్త్రంలో 99.8903697 శాతం, రసాయన శాస్త్రంలో 99.8618693, జీవశాస్త్రం (వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం)లో 99.9402991 శాతం సాధించింది. 12వ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థి నీట్లో ఇంత స్కోరు సాధించడం పెద్ద విషయమే.