AP Arogyasree : ఏపీలో ‘ఆరోగ్యశ్రీ’ ట్రస్ట్ కు మంగళం.. ఇక నుంచి చెల్లింపులు అలా చేస్తారు! ఏపీ ప్రజలకు షాక్!

ఏపీలో ఆరోగ్యశ్రీ దేశానికే ఆదర్శం. రాజశేఖర్ రెడ్డి ఈ పథకాన్ని ప్రవేశపెట్టడంతో మిగతా రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకున్నాయి. పథకాన్ని అమలు చేస్తూ వస్తున్నాయి.

Written By: Dharma, Updated On : August 2, 2024 10:25 am
Follow us on

AP Arogyasree : కీలక నిర్ణయాలు దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. శాశ్వత పథకాల విషయంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఆరోగ్యశ్రీపై ఫోకస్ పెట్టింది. తరచు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు నెట్వర్క్ ఆసుపత్రులు ప్రకటనల నేపథ్యంలో.. అటువంటి పరిస్థితి రాకుండా చూడాలని చూస్తోంది.కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకం అమలు చేస్తున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. అదే సమయంలో ఆరోగ్యశ్రీ సేవల బిల్లులు చెల్లించాలంటూ ఆసుపత్రులు కోరాయి. పేరుకుపోయిన మొండి బకాయిలు చెల్లించకుంటే సేవలు నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం కొత్తగా ఆలోచన చేసింది. ఇకనుంచి ట్రస్ట్ నుంచి కాకుండా.. బీమా సంస్థల నుంచి చెల్లింపులు చేసేలా చూడాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ బీమా కంపెనీ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. బీమా సదుపాయాలపై వారితో చర్చించారు. బీమా విధానంలో ఆరోగ్యశ్రీ సేవలపై సీఎం చంద్రబాబుకు నివేదిక ఇవ్వనున్నారు. వైసీపీ సర్కార్ ఆరోగ్యశ్రీ ద్వారా అందుతున్న సేవలను 5 లక్షల నుండి 25 లక్షలకు పెంచిన సంగతి తెలిసిందే. అయితే నెట్వర్క్ ఆసుపత్రులకు చెల్లింపుల విషయంలో బిల్లులు పెండింగ్ లో ఉంచింది. దాదాపు 1500 కోట్ల రూపాయల వరకు ఆసుపత్రులకు చెల్లించాల్సి ఉంది. మొత్తం చెల్లింతులను ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా కొనసాగిస్తున్నారు. అందుకే ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయని గుర్తించారు. ట్రస్టు ద్వారా కాకుండా బీమా విధానంలో చెల్లింపులు చేస్తే.. నిధులు ఎప్పటికప్పుడు సర్దుబాటు అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయ్యేనాటికి బీమా విధానం ముసాయిదా రూపొందించాలని కసరత్తు చేస్తున్నారు.

* వైఎస్సార్ ఆశల పథకం
2004లో వైయస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి ఉచితంగా కొన్ని వైద్య సేవలు అందించేందుకు నిర్ణయించారు. అటు తర్వాత ఆరోగ్యశ్రీ కార్డును ప్రత్యేకంగా అందించారు. తొలినాళ్లలో బీమా రూపంలోనే పథకాన్ని అమలు చేసేవారు. ప్రభుత్వమే బీమా మొత్తాన్ని భరించేది. ఎవరైనా వైద్య సేవలు పొందాలంటే సంబంధిత కంపెనీలు అందుకు అయ్యే వ్యయాన్ని విడుదల చేసేవి. కానీ తరువాత ప్రస్తుత ద్వారా చెల్లింపులు చేయాలని ప్రభుత్వం భావించింది. అక్కడి నుంచి ట్రస్టు ద్వారా సేవలు కొనసాగుతున్నాయి.

* ట్రస్టు ద్వారా బిల్లులు
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వందలాది నెట్వర్క్ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందుతున్నాయి. రోగులు తీసుకున్న చికిత్స మేరకు ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తోంది. ఈ నిర్వహణలో ఆసుపత్రుల నుంచి కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. చాలా సందర్భాల్లో ఆరోగ్యశ్రీ సేవలు తాత్కాలికంగా నిలిచిన పరిస్థితులు ఉన్నాయి. అందుకే ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రస్తుత ద్వారా కాకుండా బీమా విధానంలో అమలు చేయాలని ఒక నిర్ణయానికి వచ్చింది. బీమా విధానంలో అయితే హెల్త్ కార్డులు ఉన్నవారు దేశవ్యాప్తంగా చికిత్స పొందే వెసులుబాటు ఉంటుంది.

* బీమా సంస్థల ద్వారా చెల్లింపులు
ప్రభుత్వం కొన్ని బీమా కంపెనీలను ఎంపిక చేస్తుంది. సదరు భీమా కంపెనీ నుంచి ఆసుపత్రికి చికిత్స మొత్తం చేసిన నగదు అందుతుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1.35 కోట్ల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి. 5.5 లక్షల మంది ఉద్యోగులు, మూడు లక్షల మంది పెన్షనర్లకు ఈ హెచ్ ఎస్ ఉంది. కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకం అనుసంధానంగా.. ఆరోగ్యశ్రీని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.