spot_img
Homeజాతీయ వార్తలుFeticides: 20 ఏళ్లలో 90 లక్షల మందిని ఆడ శిశువులను కడుపులోనే చంపేశారు

Feticides: 20 ఏళ్లలో 90 లక్షల మందిని ఆడ శిశువులను కడుపులోనే చంపేశారు

Feticides: ఆకాశంలో సగం.. అన్నింటా సగమని అందరూ చెబుతుంటారు కానీ.. వాస్తవ పరిస్థితి అలా ఉండదు. అరచేతిలో ప్రపంచం ఇమిడిపోతున్న ఈ రోజుల్లోనూ ఆడపిల్లలపై జరుగుతున్న వేధింపులు అన్ని ఇన్ని కావు. పైగా పిల్లల్లో ఆడా మగా అని తేడా లేకుండా సమానమే అన్న భావన సమాజంలో ఇంకా పూర్తిగా నాటుకోలేదు. కడుపులో ఉన్నది ఆడ శిశువు అని తెలియగానే కొందరు గర్భస్రావం చేయిస్తున్నారు. గత రెండు దశాబ్దాల్లో అంటే 2000 నుంచి 2019 వరకు 90 లక్షల భ్రూణ హత్యలు జరిగాయి. ఇవన్నీ కూడా ఆడ శిశువులవేనని ప్యూ రీసెర్చ్ సెంటర్ తన అధ్యయనంలో వెల్లడించింది. అదే సమయంలో సంతానంగా అబ్బాయిలే కావాలి అని ఆకాంక్ష క్రమంగా తగ్గుతుండటం గమనార్హం. దేశంలో క్రమంగా సమతౌల్య లింగ నిష్పత్తి వైపు ప్రజలు పయనిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో ప్రతి వంద మంది అమ్మాయిలకు 108 మంది అబ్బాయిలు ఉన్నట్టు ఐదో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019-21 వెల్లడించింది. 2011లో ప్రతి వంద మంది అమ్మాయిలకు 111 మంది అబ్బాయిలు ఉండేవారు. ఆ రకంగా చూస్తే లింగ నిష్పత్తి ఎంతో కొంత మెరుగుపడినట్టే.

Feticides
Feticides

1950లో మెరుగ్గా

2019_21తో పోల్చితే 1950లో మన దేశంలో లింగ నిష్పత్తి మెరుగ్గానే ఉండేది. అప్పట్లో దేశంలో ప్రతి వంద మంది అమ్మాయిలకు 105 మంది అబ్బాయిలు ఉండేవారు. ఆ తర్వాత భ్రూణ హత్యలు పెరిగాయి. 1970లో అందుబాటులోకి వచ్చిన లింగ నిర్ధారణ పరీక్షలు చేసే ప్రినేటల్ డయాగ్నస్టిక్ టెక్నాలజీ తో అబార్షన్లు సులభతరం అయ్యాయి. లింగ నిర్ధారణ అనేది నేరం అయినప్పటికీ.. కాసులకు కక్కుర్తి పడిన ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకులు యదేచ్ఛగా పరీక్షలు నిర్వహిస్తూ కడుపులో ఉన్నది ఆడపిల్ల అయితే గర్భ స్రావాలు చేస్తున్నారు. ఒక్కోసారి గర్భస్రావాలు వికటించి తల్లి, ఆమె కడుపులో పెరుగుతున్న పిండం.. ఇద్దరూ చనిపోయేవారు. ఇలా ఈ దశాబ్దంలో సుమారు రెండు లక్షల వరకు మాతృ, భ్రూణ మరణాలు సంభవించాయని ప్యూ సంస్థ తన నివేదికలో తెలిపింది.

భారత్ ఆరో స్థానం

లింగ నిష్పత్తిలో అత్యంత వ్యత్యాసం ఉన్న దేశాల్లో ఆల్బెనియా, వియత్నాం, ఆర్మీనియా, చైనా, అజర్ బైజాన్ తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయి. ఈ జాబితాలో భారత్ ఆరో స్థానంలో ఉంది. అయితే 2015లో బేటి బచావో బేటి పడావో కార్యక్రమాన్ని కేంద్రం సంకల్పించడం వల్ల ఉత్తర ప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, పంజాబ్, బీహార్, ఢిల్లీలోని 405 జిల్లాల్లో అమల్లోకి తేవడంతో లింగ నిష్పత్తిలో పెరుగుదల కనిపించినట్టు ఈ అధ్యయనం పేర్కొంది. 2010లో 4.80 లక్షల మంది ఆడ శిశువులు జన్మించగా, 2019 నాటికి ఆ సంఖ్య 4.10 లక్షలకు పడిపోయినట్టు కేంద్ర గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దేశంలో అతిపెద్ద జనాభా ఉన్న హిందువుల్లో ఆడ శిశువుల సంఖ్య తగ్గిపోవడం ఎక్కువగా ఉన్నట్లు ఎన్ని వేదిక ద్వారా తెలుస్తోంది. 1998-99 కాలంలో అబ్బాయిలు ఎక్కువ కావాలనే భావన సిక్కుల్లో ఉండేది. ఆ ప్రస్తుతం అది 9% తగ్గిపోయింది. హిందూ, ముస్లిం మహిళల్లో 34 శాతం మంది తమకు కొడుకే పుట్టాలని కోరిక ఉండేదని, అది 15 శాతానికి తగ్గినట్టు వెల్లడించింది. 20% క్రైస్తవ మహిళలు పుత్రుడు జన్మించాలని భావనతో ఉండేవారని, ప్రస్తుతం అది 12 శాతానికి తగ్గినట్టు ప్యూ సంస్థ పేర్కొంది.

Feticides
Feticides

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో కూడా

కాగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఐదవ జాతీయ కుటుంబ సర్వేలో స్థితిమంతులు, చదువుకున్న మహిళలంతా కూడా కొడుకే కావాలనే ఆసక్తిని పెద్దగా చూపలేదు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 1998- 99ను 2019-21 తో పోల్చి చూస్తే అబ్బాయిలే కావాలనుకుంటున్న వారి శాతం తగ్గింది. చదువు, ఉద్యోగం, సంపద, పట్టణీకరణ వంటి కారణాలవల్ల మహిళలు సులువుగా లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారు. మరోవైపు దేశంలోని అన్ని మతాల్లోనూ సంతాన సాఫల్య రేటు తగ్గుతుంది. ఈ విషయంలో సిక్కుల్లో సంతాన సాఫల్య రేటు అతి తక్కువగా ఉండగా, ముస్లిం మహిళల్లో మాత్రం ఎక్కువగా ఉంది. ఇక చిన్న కుటుంబాల్లో అబ్బాయిల ఎక్కువగా ఉండగా, పెద్ద కుటుంబాల్లో మాత్రం అమ్మాయిల సంఖ్య ఎక్కువగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బేటి బచావో బేటి పడావో లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే లింగ నిష్పత్తిలో అంతరాన్ని పూర్తిగా తగ్గించవచ్చని ఫ్యూ సంస్థ అభిప్రాయపడింది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular