శనివారం గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతుండగా కాంగ్రెస్ సభ్యులు అడ్డుపడ్డారు. దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. సభలో ఇష్టమొచ్చినట్లు అరవడం సరికాదని, సభకు ఆటంకం కలిగించే చర్యలను సహించమని కేసీఆర్ స్పష్టం చేశారు.
అసెంబ్లీకి ఒక పద్ధతి ఉంటుందని, దాని ప్రకారం నడుచుకోవాల్సిన బాధ్యత సభ్యులందరిపై ఉందని ఆయన పేర్కొన్నారు. సభలో ఇష్టమొచ్చినట్లు అరిచి, అరాచకం సృష్టిస్తే కుదరదని తేల్చిచెప్పారు.
ఏదో ఒక విధంగా బయటకు వెళ్లాలనే కాంగ్రెస్ సభ్యుల గొడవ చేస్తున్నారని, సభకు ఆటంకం కలిగించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డికి సీఎం సూచించారు. దీంతో ఆరుగురు సభ్యులను సభ నుంచి ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు.