మెట్టుదిగితేనే.. సమస్యకు పరిష్కారం

కేంద్రం తెచ్చిన మూడు అగ్రి చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్‌ రైతు ఉద్యమం ఉవ్వెత్తున సాగుతోంది. ఒకట్రెండు రాష్ట్రాలతో మొదలైన ఉద్యమం కాస్త.. ఆయా రాష్ట్రాలకూ విస్తరించింది. నిన్న ఏకంగా ఎర్ర కోటకు చేరి రైతు జెండాను ఆవిష్కరించడం వారి పంథాకు నిదర్శనం. నెలన్నర రోజులుగా ఎముకలు కొరికేలా చలి వణికిస్తున్నా.. మధ్యలో వరుణుడు పరేషాన్‌ చేసినా.. దేనికీ వెరువకుండా తమ ఆందోళనను కొనసాగించారు. చట్టాలను రద్దు చేసే వరకూ ఊరుకునేది లేదంటూ పట్టుబడుతున్నారు. కనీస మద్దతు […]

Written By: Srinivas, Updated On : January 27, 2021 11:29 am
Follow us on

కేంద్రం తెచ్చిన మూడు అగ్రి చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్‌ రైతు ఉద్యమం ఉవ్వెత్తున సాగుతోంది. ఒకట్రెండు రాష్ట్రాలతో మొదలైన ఉద్యమం కాస్త.. ఆయా రాష్ట్రాలకూ విస్తరించింది. నిన్న ఏకంగా ఎర్ర కోటకు చేరి రైతు జెండాను ఆవిష్కరించడం వారి పంథాకు నిదర్శనం. నెలన్నర రోజులుగా ఎముకలు కొరికేలా చలి వణికిస్తున్నా.. మధ్యలో వరుణుడు పరేషాన్‌ చేసినా.. దేనికీ వెరువకుండా తమ ఆందోళనను కొనసాగించారు. చట్టాలను రద్దు చేసే వరకూ ఊరుకునేది లేదంటూ పట్టుబడుతున్నారు. కనీస మద్దతు ధరకు లిఖిత పూర్వక హామీ ఇచ్చే వరకు తమ ఆందోళనను విరమించేది లేదని తేల్చిచెబుతున్నారు.

జై జవాన్, జై కిసాన్ అని 60లో నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి పిలుపునిచ్చారు. అన్నంపెట్టే అన్నదాత అంటే అందరికీ గౌరవమే. వారి సమస్యల పట్ల ప్రతి ఒక్కరికీ సానుభూతి ఉంది. దీంతో కొత్త చట్టాల పైనా కేంద్రం బెట్టచేయకుండా దిగిరావాలని కోరుకుంటున్నారు. చివరకు ఉత్యున్నత న్యాయస్థానం సైతం రైతులకు సానుకూలంగా తీర్పునిచ్చింది. నలుగురు సభ్యులతో కమిటీని నియమించింది. వీరిలో ఒక సభ్యుడు భూపేందర్ సింగ్ మాన్ కమిటీ నుంచి తప్పుకున్నారు. అశోక్ గులాటీ, అనిల్ ఘన్వాత్, ప్రమోద్ కుమార్ జోషీ మిగిలిన సభ్యులు. రెండునెలల్లో సమస్య పరిష్కారానికి బాటలు వేయాలని ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డే సారథ్యంలోని సుప్రీంకోర్టు దర్మాసనం ఆదేశించింది. అంతేకాక సాగు చట్టాలపై స్టే విధించింది.

నెలన్నర రోజులుగా నడుస్తున్న రైతు ఉద్యమంలో ఎక్కువ భాగం సిక్కులదేనని స్పష్టమవుతోంది. ఇందులో వంద శాతం వాస్తవమే ఉంది. దక్షిణాదిని పక్కనపెడితే ఉత్తరాదికి చెందిన రాజస్థాన్, యూపీ, మధ్యప్రదేశ్, తదితర రాష్ట్రాల రైతులు ఉద్యమంలో పెద్దయెత్తున పాల్గొన్న దాఖలాలు లేవు. పంజాబ్, హర్యానాల్లో వరి, గోధుమ ఎక్కువగా పండిస్తారు. ప్రభుత్వం ప్రకటించిన 23 మద్దతు ధరల పంటల జాబితాలో ఈ రెండు పంటలూ ఉన్నాయి. కనీస మద్దతు ధరకు హామీ లేకపోవడం వల్ల వరి, గోధుమ రైతులు ఎక్కువగా నష్టపోతారు. పంజాబ్‌లో చాలా మంది రైతులు సంపన్నులు. రాజకీయాలను ప్రభావితం చేసే శక్తి అక్కడి రైతులకు ఉంది. అకాలీదళ్ కు సంపన్న జాట్ సిక్కు రైతుల మద్దతు ఉంది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా అకాలీదళ్ కేంద్ర మంత్రివర్గం నుంచి వైదొలగింది. బీజేపీతో పొత్తును సైతం వదులుకుంది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా పరోక్షంగా రాజకీయ కారణాలతో ఉద్యమానికి మద్దతు పలుకుతున్నారు.

అన్నింటికీ మించి విదేశాల్లో ఉన్న సిక్కులు అక్కడి ప్రభుత్వాల ద్వారా భారత్ పై ఒత్తిడి తెస్తున్నారు. కెనడాలో పెద్దసంఖ్యలో స్థిరపడిన సిక్కులు అక్కడి ప్రధాని జస్టిన్ ట్రూడో ద్వారా భారత్ పై ఒత్తిడి తెచ్చారు. ఆయన కూడా అనాలోచితంగా మాట్లాడారు. కెనడాలో 17 మంది సిక్కు ఎంపీలున్నారు. నలుగురు సిక్కు మంత్రులున్నారు. భారత్ లో కూడా ఇంతమంది సిక్కు ఎంపీలు, మంత్రులు లేరు. బ్రిటన్, ఆస్ట్రేలియాల్లోని సిక్కులు కూడా అక్కడి రాయబార కార్యాలయాల ద్వారా ఒత్తిడి తెస్తున్నారు. రెండువైపులా కొంతమందికి ఉద్యమానికి ఖలిస్థాన్ రంగు పులుముతున్నారు. సుప్రీంకోర్టు నియమించిన కమిటీతో చర్చించబోమని కొంతమంది రైతునేతలు ప్రకటిస్తున్నారు. ఈ పరిణామాలు ఎంత మాత్రం సరికావు. ఇవి సమస్యను పక్కదోవ పట్టిస్తాయి. యావత్ జాతి అన్నదాతలకు అండగా ఉంది. మరి ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఇరు పక్షాలూ చెరో మెట్టు దిగాల్సిందే.