Vijayasai Reddy Daughter: చాలా రోజుల అజ్ఞాతం తర్వాత విజయ్ సాయి రెడ్డి వైసీపీలో యాక్టివయ్యారు. హై కమాండ్ సైతం విజయసాయిని దాదాపు పక్కన పెట్టినట్టు సంకేతాలు ఇచ్చింది. అటు విజయ్ సాయి సైతం ఢిల్లీకే పరిమితమయ్యారు. పార్టీతో చాలా గ్యాప్ తీసుకున్నారు. అటు ట్విట్ల విమర్శలకు సైతం దూరంగా ఉండేవారు. ప్రధానంగా ఢిల్లీ మద్యం కుంభకోణంలో అల్లుడు సోదరుడి అరెస్ట్ తరువాత వ్యూహాత్మక మౌనం పాటించారు. దాదాపు పార్టీకి దూరమయ్యారన్న టాక్ నడిచింది. కానీ ఇటీవల అనూహ్యంగా మళ్లీ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.
అవసరం ఎంత పనైనా చేయిస్తుందంటారు. ఇప్పుడు అవసరం విజయ్ సాయి రెడ్డికి పడింది. ఉత్తరాంధ్ర పార్టీ సమన్వయకర్తగా ఉండేటప్పుడు విశాఖలో చాలా భూములు పై కన్నేశారని ప్రచారం సాగింది. అందుకే హై కమాండ్ ఆ పదవి నుంచి తప్పించిందని అప్పట్లో టాక్ నడిచింది. అయితే ఇప్పుడు అది నిజమేనని తేలుతోంది. విశాఖలో ఒక 100 ఎకరాల కొండపై విజయ్ సాయి రెడ్డి కన్నెశారని తాజాగా ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. తన కుమార్తె ముచ్చట పడడంతో ఆ 100 ఎకరాల కొండను కొల్లగొట్టేందుకు విజయ్ సాయి రెడ్డి పావులు కదుపుతున్నట్లు సమాచారం.
విశాఖలో ఆనందపురం పెందుర్తి రోడ్ లో తర్లు కొండ ఉంటుంది. ఈ కొండను విజయసాయిరెడ్డి కుమార్తె నేహా రెడ్డికి రాసి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆమె అంతర్జాతీయ ప్రమాణాలతో ఓ ప్రైవేటు యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. నేహా రెడ్డి అరబిందో వారి ఇంటి కోడలు. విశాఖలో చాలావరకు భూములు ఆమె పేరిట మారిపోయాయని ప్రచారం జరిగింది. సొంత పార్టీ వారే జగన్ కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే నేహా రెడ్డి ప్రైవేటు యూనివర్సిటీ ఏర్పాటుకు భూములు కేటాయించాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. తండ్రిని అడ్డం పెట్టుకొని కారు చౌకగా ప్రభుత్వ భూములు కొల్లగొట్టాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఫైలు చకచకా ముందు కదులుతున్నట్లు సమాచారం.
అయితే విజయ్ సాయి రెడ్డి పార్టీలో రీ యాక్టివ్ అవడం వెనుక ఈ భూములు వ్యవహారమే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఉత్తరాంధ్ర పై వైసీపీ నేతలు పడ్డారని పవన్ ఆరోపించారు. దానిని నిజం చేస్తూ విజయ్ సాయి రెడ్డి కుటుంబం పేరిట వ్యవహారం బయటకు రావడం గమనార్హం. ఇటీవల విజయనగరం జిల్లా బొబ్బిలిలో బొత్స కుటుంబం 30 ఎకరాల భూమి రాయించుకుందన్న ఆరోపణలు బయటికి వచ్చాయి. ప్రభుత్వ భూములను సీక్రెట్ జీవోల ద్వారా స్వాధీనం చేసుకున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ఒక వైపు ప్రకృతి ప్రసాదించిన రిషికొండలాంటి పర్యాటక ప్రాంతాన్ని ధ్వంసం చేస్తున్నారు. ఇప్పుడు ఎంతో చరిత్ర కలిగిన తర్లు కొండను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.