Morning Spiritual Routine: ఉదయం నిద్రలేవగానే చాలామంది దేవుడి పటాలు, తల్లిదండ్రుల ఫొటోలు లేదా ఇష్టదైవాన్ని దర్శించుకోవడం అలవాటుగా చేసుకుంటారు. అయితే ప్రసిద్ధ ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు చెప్పే ఆధ్యాత్మిక సందేశాల్లో ఒకటి మాత్రం ఎంతో విశిష్టమైనది. రోజును ప్రారంభించే ముందు కాసేపు మన అరచేతులను దర్శిస్తూ ఒక పవిత్ర శ్లోకాన్ని స్మరించుకోవాలని ఆయన సూచిస్తుంటారు. ఇలా చేయడం వల్ల రోజంతా దైవచింతనతో పాటు సానుకూల భావన కలుగుతుందని అంటున్నార. ఇంతకీ ఆ శ్లోకం ఏంటీ?
సనాతన ధర్మంలో మన శరీరాన్నే దైవస్వరూపంగా భావిస్తారు. ముఖ్యంగా చేతులు కర్మకు ప్రతీక. మనం చేసే ప్రతి పని చేతుల ద్వారానే జరుగుతుంది. అందుకే ఉదయం నిద్రలేవగానే చేతులను చూసి వాటిలోనే దైవాన్ని దర్శించుకోవాలని శాస్త్రాలు సూచించాయి. ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాకుండా, రోజు ప్రారంభంలో మనసును ఆధ్యాత్మికత వైపు మళ్లించే సాధనగా భావిస్తారు.
ఉదయం అరచేతులను చూస్తూ ఈ శ్లోకాన్ని భక్తిశ్రద్ధలతో స్మరించుకోవాలని గరికిపాటి నరసింహారావు సూచిస్తారు.
కరగ్రే వసతే లక్ష్మీః
కరమధ్యే సరస్వతీ
కరమూలే తు గోవిందః
ప్రభాతే కరదర్శనం
ఈ శ్లోకంలో అరచేతి చివర భాగంలో మహాలక్ష్మీదేవి, మధ్య భాగంలో సరస్వతీదేవి, చేతి మూల భాగంలో శ్రీమహావిష్ణువు (గోవిందుడు) నివసిస్తారని భావిస్తారు. అందువల్ల ఉదయం మొదట మన చేతులను దర్శించడం అంటే ఐశ్వర్యం, జ్ఞానం, దైవానుగ్రహాన్ని ఒకేసారి స్మరించుకోవడమేనని ఆధ్యాత్మిక వేత్తలు వివరిస్తారు.
ఈ శ్లోకం కేవలం దేవతలను స్మరించమని చెప్పడం మాత్రమే కాదు. మన జీవితాన్ని మన చేతులే నిర్మిస్తాయని గుర్తుచేసే గొప్ప సందేశం కూడా ఇందులో ఉంది. లక్ష్మీ అంటే సంపద, సరస్వతి అంటే జ్ఞానం, గోవిందుడు అంటే ధర్మం, దైవకృపకు ప్రతీక. ఈ మూడు కలిసి ఉంటేనే జీవితం సార్థకమవుతుందనే భావాన్ని ఈ శ్లోకం తెలియజేస్తుంది.
ఉదయం నిద్రలేవగానే మంచం మీద నుంచే రెండు అరచేతులను కలిపి కాసేపు వాటిని చూడాలి. అనంతరం పై శ్లోకాన్ని నెమ్మదిగా స్మరించి, దేవుడికి నమస్కరించి తర్వాత నేలపై కాలు పెట్టడం శుభప్రదంగా భావిస్తారు. అనంతరం భూమాతకు నమస్కారం చేసి రోజువారీ పనులను ప్రారంభించడం సనాతన సంప్రదాయంలో భాగంగా చెప్పబడింది.
