Summer Heat Effect On Kidneys: ఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే.. వచ్చే రోజుల్లో నిప్పుల కుంపటి ఖాయమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఎండలు పెరిగితే మన దేహంలో చెమట ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఎండలో తిరిగితే వెంటనే నీరసం ఆవహిస్తూ ఉంటుంది. అంతేకాదు డిహైడ్రేషన్ వల్ల శరీరంలో అనేక రకాలైన అవయవాలు ప్రభావితం అవుతాయి. ఇందులో తీవ్రంగా ప్రభావితమయ్యే అవయవం ఒకటుంది. అదే మూత్రపిండం. ఎండాకాలంలో మూత్రపిండాల మీద తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. ఇదే సమయంలో కిడ్నీల ఆరోగ్యం కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.. అందువల్ల ఎండాకాలంలో కిడ్నీల సంరక్షణ కోసం చాలావరకు జాగ్రత్తలు తీసుకోవాలి.
మూత్రపిండాలు శరీరంలో ఉన్న అనవసరమైన లవణాలను.. విష పదార్థాలను బయటకు పంపిస్తుంటాయి. ఇదే సమయంలో ఖనిజలవణాలను తిరిగి దేహానికి పంపించి.. ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ చేస్తుంటాయి. వారికి ఒక వ్యక్తి ఎండ వల్ల విపరీతంగా చెంపను కోల్పోతుంటాడు. ఆ సమయంలో కోల్పోయిన ద్రవాలను శరీరం కచ్చితంగా భర్తీ చేసుకోవాలి. లేకపోతే రక్తం కొంత పరిధిలో చిక్కబడిపోతూ ఉంటుంది. రక్త ప్రవాహం ఆశించిన స్థాయిలో జరగదు. అప్పుడు మూత్రపిండల మీద ఒత్తిడి పడుతుంది. ఫలితంగా కిడ్నీ పనితీరు ప్రభావితం అవుతుంది. ఈ పరిస్థితిని వైద్య పరిభాషలో అక్యూటివ్ కిడ్నీ ఇంజురీ అని పిలుస్తుంటారు.
ఎండల వల్ల మూత్రపిండాలు తీవ్రంగా ప్రభావితం అవుతుంటాయి. వాటి పనితీరు తగ్గిపోతూ ఉంటుంది. అంతేకాదు మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడుతుంటాయి. మూత్రంలో ఇన్ఫెక్షన్ ఏర్పడుతూ ఉంటుంది. అక్యూట్ కిడ్నీ ఇంజురీ దీర్ఘకాలం కొనసాగితే మూత్రపిండాలు అనేక రకాలైన సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాలలో క్రానిక్ కిడ్నీ డిసీస్ వంటి తీవ్రమైన సమస్యకు దారి తీయవచ్చు. దేహంలో నీటి మోతాదు తగ్గిపోతే లవణాల గాఢత అధికమవుతుంది. ఆ సమయంలో లవణాలు రాళ్ల మాదిరిగా మారిపోతాయి. అందువల్లే దేహంలో నీటి మోతాదు తగ్గుతున్నప్పుడు కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం ఎక్కువవుతుంది.
సాధారణంగా యుటిఐ..(యూరినరీ ట్రాక్ట్) పురుషులతో పోల్చి చూస్తే స్త్రీలలో పొడుగు కాస్త తక్కువగా ఉంటుంది. అందువల్ల మూత్రంలో ఇన్ఫెక్షన్లు మహిళల్లోనే ఎక్కువగా ఉంటాయి. కిడ్నీ ఇంజురీ కేసులు మాత్రం పురుషుల్లోనే ఎక్కువగా ఉంటాయి.
ఈ లక్షణాలు కనిపిస్తే..
గతంతో పోల్చి చూస్తే మూత్రం తక్కువగా రావడం.. చీకటి రంగులో రావడం.. ముఖం.. కాళ్ల భాగంలో వాపు రావడం.. విపరీతమైన అలసట.. ఏది కూడా తినాలి అనిపించకపోవడం.. మూత్ర విసర్జన చేస్తున్నప్పుడు నొప్పి.. విపరీతమైన ఇబ్బంది ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
ఈ సమాచారం డాక్టర్ రవికుమార్, సీనియర్ కన్సల్టెంట్, యూరాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ సర్జన్ అభిప్రాయాల ఆధారంగా పాఠకుల కోసం అందించాం. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడుని సంప్రదించాల్సిన అవసరం ఉంది. ఈ కథనం ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్యుల చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఈ విషయాన్ని ఓకే తెలుగు పదేపదే తన పాఠకులకు స్పష్టం చేస్తోంది.