ప్రస్తుతం దేశంలో ఎవరిని కదిలించినా కరోనా మహామ్మారి గురించే తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. దేశంలోని ప్రజలకు కరోనా మహమ్మారి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ మహమ్మారి బారిన పడుతున్నామని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేగంగా విజృంభిస్తున్న ఈ మహమ్మారి దేశ ఆర్థిక వ్యవస్థపై సైతం తీవ్రంగా ప్రభావం చూపింది.
ఎంత త్వరగా కరోనాను కట్టడి చేసే సమర్థవంతమైన వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే అంత త్వరగా దేశంలో సాధారణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. పలు దేశాల ప్రభుత్వాలు సైతం వ్యాక్సిన్లను తయారు చేస్తున్న కంపెనీలను వీలైనంత త్వరగా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేస్తున్నాయి. అయితే ఇదే సమయంలో యూకే ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఆందోళన కలిగించే వ్యాఖ్యలు చేసింది.
టాస్క్ఫోర్స్ ఛైర్మన్ కేట్ బింగమ్ తొలితరం కరోనా వ్యాక్సిన్లు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన రోగులపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని.. కరోనాకు సమర్థవంతమైన వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందో లేదో కూడా చెప్పలేమని పేర్కొన్నారు. అయితే వ్యాక్సిన్లు కరోనా తీవ్రతను తగ్గించే అవకాశాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయని తెలిపారు.
కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా రోగులపై ఒకే తరహా ప్రభావం చూపుతుందో చూపదో చెప్పలేమని అన్నారు. 65 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవాళ్లకు సమర్థవంతమైన వ్యాక్సిన్ ఎంతో అవసరమని పేర్కొన్నారు. మరోవైపు ప్రజల్లో యాంటీబాడీలు వేగంగా తగ్గుతున్నట్టు గుర్తించామని తెలిపారు.