Homeహెల్త్‌Pregnancy After 40: 40 ఏళ్ల తరువాత గర్భం వస్తే ఈ సమస్యలు.. ఏం...

Pregnancy After 40: 40 ఏళ్ల తరువాత గర్భం వస్తే ఈ సమస్యలు.. ఏం చేయాలంటే..

Pregnancy After 40: ప్రస్తుతం మహిళలు చదువు, ఉద్యోగం, కెరీర్, ఆర్థిక స్థిరత్వం వంటి కారణాల వల్ల ఆలస్యంగా వివాహం చేసుకోవడం, ఆలస్యంగా గర్భధారణకు ప్లాన్ చేయడం పెరుగుతోంది. అయితే వైద్య నిపుణుల ప్రకారం 35 నుంచి 40 ఏళ్ల తర్వాత గర్భం దాల్చడం కొన్ని ప్రత్యేక ఆరోగ్యపరమైన సవాళ్లను తీసుకువస్తుంది. ఈ వయసులో గర్భధారణ సాధ్యమే అయినప్పటికీ, తల్లి మరియు శిశువు ఆరోగ్యంపై ఎక్కువ జాగ్రత్త అవసరమని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. అవేంటంటే?

మహిళల శరీరంలో వయసు పెరుగుతున్న కొద్దీ అండాల నాణ్యత తగ్గుతుంది. సాధారణంగా 30 ఏళ్ల తర్వాత ఫెర్టిలిటీ క్రమంగా తగ్గడం మొదలవుతుంది. 35 ఏళ్ల తర్వాత ఈ తగ్గుదల మరింత వేగంగా ఉంటుంది. దీనివల్ల గర్భం దాల్చడానికి ఎక్కువ సమయం పట్టడం, కొన్నిసార్లు సహజ గర్భధారణ కష్టమవడం జరుగుతుంది. అందుకే ఈ వయసులో చాలామంది ఐవీఎఫ్ వంటి ఫెర్టిలిటీ చికిత్సలను ఆశ్రయిస్తున్నారు.

ఈ వయసులో గర్భధారణలో అబార్షన్ ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అండాల నాణ్యత తగ్గడం వల్ల పిండంలో జన్యుపరమైన లోపాలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. దాంతో గర్భస్రావం, పిండం ఎదుగుదల సరిగా లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా మొదటి మూడు నెలలు అత్యంత కీలక దశగా పరిగణిస్తారు. గర్భధారణ సమయంలో హైబీపీ, గర్భకాల మధుమేహం వంటి సమస్యలు కూడా ఎక్కువగా కనిపిస్తాయి. వయసు పెరిగే కొద్దీ శరీరంలోని హార్మోన్ల సమతుల్యత మారిపోతుంది. దీనివల్ల రక్తపోటు నియంత్రణ కష్టమవుతుంది. హైబీపీ ఎక్కువైతే కిడ్నీలు, లివర్‌పై ఒత్తిడి పెరిగి తల్లి ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ‘ప్రీ ఎక్లాంప్సియా’ వంటి తీవ్రమైన పరిస్థితులు కూడా తలెత్తవచ్చు. ప్రీ-టర్మ్ డెలివరీ అంటే గడువు తేదీకి ముందే ప్రసవం జరిగే అవకాశాలు కూడా ఈ వయసులో ఎక్కువగా ఉంటాయి. ముందుగానే పుట్టిన శిశువులకు శ్వాస సమస్యలు, బరువు తక్కువగా ఉండటం, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది. అందువల్ల గర్భిణి ఆరోగ్యాన్ని నిరంతరం పరిశీలిస్తూ ప్రత్యేక వైద్య పర్యవేక్షణ అవసరం అవుతుంది.

ఇలాంటి పరిస్థితుల్లో గర్భం కావాలని కోరుకునేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రెగ్యులర్ చెకప్‌లు చేయించుకోవడం.. రక్తపరీక్షలు, స్కానింగ్‌లు, బీపీ మానిటరింగ్, షుగర్ టెస్టులు తరచుగా చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. గర్భంలోని శిశువు ఎదుగుదల సక్రమంగా ఉందో లేదో నిరంతరం పరిశీలించడం ద్వారా ప్రమాదాలను ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుంది.

ఆహారపు అలవాట్లు కూడా చాలా కీలకం అని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఐరన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఒత్తిడి తగ్గించేలా తగినంత నిద్ర, తేలికపాటి వ్యాయామం, యోగా చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ధూమపానం, మద్యం వంటి అలవాట్లు పూర్తిగా దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు.

అయితే 35 లేదా 40 ఏళ్ల తర్వాత గర్భధారణ అంటే తప్పనిసరిగా ప్రమాదమనే కాదు. సరైన వైద్య పర్యవేక్షణ, ఆరోగ్యకరమైన జీవనశైలి, సమయానికి పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనివ్వడం సాధ్యమేనని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆధునిక వైద్య సాంకేతికత అభివృద్ధి చెందడంతో ఆలస్య గర్భధారణ కేసుల్లో కూడా మంచి ఫలితాలు వస్తున్నాయని పేర్కొంటున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version