Homeఆంధ్రప్రదేశ్‌వరద బాధితులకు జగన్ సర్కార్ సాయం.. ఉత్తర్వులు విడుదల..?

వరద బాధితులకు జగన్ సర్కార్ సాయం.. ఉత్తర్వులు విడుదల..?

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రాష్ట్రంలోని వరద బాధితులకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయం తీసుకుంది. గోదావరి, కృష్ణ వరదల వల్ల ముంపు బారిన పడిన ప్రతి కుటుంబానికి 500 రూపాయలు అందజేసేలా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. సీఎం జగన్ ఆదేశాలతో అధికారులు ఉత్తర్వులు జారీ చేయగా ఈరోజు నుంచి అధికారులు స్వయంగా వెళ్లి బాధితులకు సాయం అందించనున్నారు.

విశాఖ పట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలలోని ముంపు బాధితులకు జగన్ సర్కార్ సాయం అందనుందని తెలుస్తోంది. సీఎం వర్షాలు, వరదలపై సమీక్ష నిర్వహించి అధికారులకు నగదు సాయంతో పాటు కీలక ఆదేశాలు జారీ చేశారు. సహాయ, పునరుద్ధరణ చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని అధికారులకు సీఎం జగన్ కీలక సూచనలు చేశారు. సహాయ శిబిరాల్లో ఉన్నవారి పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని తెలిపారు.

సహాయ శిబిరాల నుంచి వరద బాధితులు ఇళ్లకు చేరుకున్న తరువాత వారి సమస్యలను తెలుసుకుని ఆ సమస్యలకు వీలైనంత తక్కువ సమయంలో పరిష్కార మార్గాలను చూపించాలని అన్నారు. జిల్లా కలెక్టర్లను ఫోన్ ద్వారా సంప్రదించి పంట నష్టం గురించి ఒక అంచనాకు రావాలని వెల్లడించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల వల్ల లక్షల ఎకరాల్లో పంట నీట మునిగింది. వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు.

పంట కోతకు వచ్చిన సమయంలో వర్షాలు కురవటంతో రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం 1,07,859 హెక్టార్ల పంట దెబ్బ తిన్నట్టు తెలుస్తోంది. ఈ నష్టం మరింత ఎక్కువగానే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మిగతా జిల్లాలతో పోలిస్తే తూర్పు గోదావరి జిల్లాపై వరద ప్రభావం ఎక్కువగా పడింది. ఈ జిల్లాలో దాదాపు 47,745 హెక్టార్ల పంట నీట మునిగినట్టు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో సైతం లక్షల ఎకరాల్లో పంట నీట మునిగిన సంగతి తెలిసిందే.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Exit mobile version