GBS Case: పెరుగుతున్న వైరస్ల ముప్పు దేశ ప్రజలను టెన్షన్ పెడుతోంది. ఇప్పటికే అనేక వైరస్లు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. గుజరాత్లో హెచ్ఎంపీవీ కేసులు పెరుగుతుండగా, మహారాష్ట్రలో గులియన్ బారే సిండ్రోమ్(జీబీఎస్) కలకలం సృష్టిస్తోంది. ఇప్పుడు ఈ జీబీఎస్ తెలంగాణలోకి ప్రవేశించింది. తొలి కేసులు తెలంగాణలో నమోదయింది. హైదరాబాద్లో గులియన్ బారే సిండ్రోమ్ కేసును వైద్యులు నిర్ధారించారు. సిద్దిపేట జిల్లాకు చెందిన మహిళకు జీబీఎస్ లక్షణాలు ఉండడంతో హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్లో మరణాలు..
జీబీఎస్ కారణంగా పశ్చిమ బెంగాల్లో మరణాలు సంభవిస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం ఓ చిన్నారి సహా ముగ్గురు మరణించారు. మరోవైపు మహారాష్ట్రలోని పూణెలోనూ 130 జీబీఎస్ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు తెలంగాణలో తొలి కేసు నమోదు కావడంతో అదికారులు అప్రమత్తమయ్యారు. బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా బలహీన రోగనిరోధక శక్తి ఉన్నవారు జీబీఎస్ బారిన పడే అవకాశం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ వైరస్ కారణంగా నరాలు బలహీనపడతాయని పేర్కొంటున్నారు.
లక్షణాలు ఇలా..
జీబీఎస్ వైరస్ సోకిన వ్యక్తికి ఒళ్లంతా తిమ్మిరిగా ఉంటుందని, కండరాలు సైతం బలహీనంగా మారడంతోపాటు డయేరియా, పొత్తికడుపు నొప్పి, జ్వరం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. కలుషిత ఆహారం తీసుకోవడం, నీటి ద్వారా ఆ బ్యాక్టీరియా సోకుతుందని వైద్యులు చెబుతున్నారు. అయితే ప్రజలు ఆందోళన చెందొద్దని సూచిస్తున్నారు. ఈ జీబీఎస్ అనేది అంటువ్యాది కాదని, చికిత్సతో నయం చేసుకోవచ్చని పేర్కొంటున్నారు. గులియన్ బారే సిండ్రోమ్ అనేది శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ నరాలపై ఒత్తిడి పడే అవకాశం ఉందని అంటున్నారు. కండరాల బలహీనత లేదా పక్షవాతం వంటి లక్షణాలు ఉంటాయని పేర్కొంటున్నారు.