Eating Rice and Chapati together: ప్రస్తుతం మధుమేహం సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవడానికి ఆహారపు అలవాట్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ నేపథ్యంలో అన్నం, చపాతీ రెండింటినీ ఒకేసారి భోజనంలో తీసుకోవడం మంచిది కాదని పోషకాహార నిపుణులు, వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మధుమేహ రోగులు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. అన్నం, చపాతీ కలిపి తింటే ఏం జరుగుతుందంటే?
అన్నం మరియు చపాతీ రెండూ ప్రధానంగా కార్బోహైడ్రేట్లను అందించే ఆహార పదార్థాలు. శరీరంలో కార్బోహైడ్రేట్లు జీర్ణమైన తర్వాత గ్లూకోజ్గా మారి రక్తంలోకి చేరతాయి. ఒకే భోజనంలో అన్నం, చపాతీ రెండింటినీ కలిపి తినడం వల్ల కార్బోహైడ్రేట్ల పరిమాణం ఒక్కసారిగా ఎక్కువవుతుంది. దీంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది.
ఏ ఆహారం తిన్న తర్వాత రక్తంలో చక్కెర ఎంత మేర పెరుగుతుందో గ్లైసెమిక్ లోడ్ ద్వారా అంచనా వేస్తారు. అన్నం, చపాతీ రెండింటినీ కలిపి తినడం వల్ల భోజనం మొత్తం గ్లైసెమిక్ లోడ్ పెరుగుతుంది. ఇది ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారిలో షుగర్ స్పైక్స్కు దారితీస్తుంది. తరచూ ఇలా జరగడం వల్ల దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. డయాబెటిస్ ఉన్నవారిలో శరీరం ఇన్సులిన్ను సరిగా ఉపయోగించలేకపోవడం లేదా తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితిలో అధిక కార్బోహైడ్రేట్లు తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం కష్టమవుతుంది. అందువల్ల వైద్యులు ఒకే భోజనంలో అన్నం లేదా చపాతీ.. వీటిలో ఏదో ఒకదాన్నే ఎంచుకోవాలని సూచిస్తున్నారు.
భోజనంలో కార్బోహైడ్రేట్లతో పాటు ఫైబర్, ప్రోటీన్లు కూడా ఉండటం చాలా ముఖ్యం. కూరగాయలు, ఆకుకూరలు, పప్పులు, శనగలు వంటి ఆహారాలు ఫైబర్ మరియు ప్రోటీన్లను అందిస్తాయి. ఇవి జీర్ణక్రియను నెమ్మదింపజేసి గ్లూకోజ్ రక్తంలోకి నెమ్మదిగా చేరేలా చేస్తాయి. ఫలితంగా షుగర్ స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా సహాయపడతాయి.
పోషకాహార నిపుణుల సూచనల ప్రకారం, భోజన ప్లేట్లో సగం భాగం కూరగాయలు, పావు భాగం ప్రోటీన్ ఆహారాలు (పప్పులు, పెరుగు, గుడ్లు మొదలైనవి), మిగిలిన పావు భాగం మాత్రమే అన్నం లేదా చపాతీలకు కేటాయించడం ఉత్తమం. ఈ విధానం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
